మరో వంద కోట్లతో వరంగల్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో నగరం ప్రగతిపథంలో పయనిస్తున్నదని చెప్పారు. హనుమకొండ బస్స్టేషన్ను ఆధునీకరిస్తామని, తహసీల్దార్ ఆఫీస్కు అనువైన స్థలాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాసిక్ను నిషేధించాలని, ఖాళీ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లను డ్రైనేజీల్లో పడవేయొద్దని ప్రజలను కోరారు. ఇంకా వర్షాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వాన నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
– హనుమకొండ చౌరస్తా, జూలై 22
హనుమకొండ చౌరస్తా, జూలై 22 : ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ఇంకా వంద కోట్లతో నగరాభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. నాలుగు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ సిక్తాపట్నాయక్, మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, ఇతర అధికారులతో కలిసి ఆయన హనుమకొండ బస్టాండ్, యూత్ హాస్టల్, ఆర్డీవో ఆఫీస్, ఎమ్మార్వో ఆఫీసులను సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా హనుమకొండ బస్స్టేషన్లో వర్షం నీరు చేరి, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో కలిసి సమస్యని పరిషరించాలని కోరినట్లు తెలిపారు.
అదే విధంగా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, కుడా చైర్మన్, ఇతర అధికారులతో కలిసి ఆర్డీవో ఆఫీస్, యువత వసతి గృహం, తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని తాతాలికంగా ఇతర ప్రదేశానికి మార్చడం కోసం పలు భవనాలను సందర్శించినట్లు తెలిపారు. తహసీల్దార్ ఆఫీస్కు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, వర్షం నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ తీగలు తెగడం, పాత గోడలు కూలడం వంటి ప్రమాదాలు ముందుగా పసిగట్టాలని, ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించాలని వినయ్భాస్కర్ ఆదేశించారు.
హనుమకొండ బస్స్టేషన్ను ఆధునీకరిస్తాం..
హనుమకొండ బస్స్టేషన్ను అన్నివిధాలుగా ఉపయోగపడేలా ఆధునీకరిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. బస్స్టేషన్లో వర్షపు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బస్స్టేషన్లో నుంచి వచ్చే మురుగుకాల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. బస్స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ను నిషేధించాలని కోరారు. వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు మురుగుకాల్వల్లో పడేయడంతో ఎక్కడికక్కడే డ్రైనేజీలో పేరుకుపోయిన వర్షపు నీళ్లు రోడ్డుపైకి వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కుడా ఛైర్మన్ సుందర్రాజ్ యాదవ్, మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం, వీవీప్యాడ్ కేంద్రం సందర్శన
హనుమకొండ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీ ప్యాడ్లపై అవగాహన కల్పించే కేంద్రాన్ని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ సందర్శించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల్లో ప్రజలకు ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పించాలనే కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలతో పాటు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్డీవో కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు కూడా ఓటు వేయడంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేశామని చీఫ్ విప్ వినయ్భాస్కర్కు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.