జనగామ, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : జనగామ కాంగ్రెస్లో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. మొన్నటికి మొన్న ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఓటింగ్ వేళ గాంధీభవన్ సాక్షిగా నియోజకవర్గ ముఖ్యనేతల మధ్య విభేదాలు పొడచూపగా ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్లో మాట్లాడిన కాల్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జనగామ నియోజకవర్గ టికెట్ ఇవ్వకుంటే డీసీసీ పదవికి రాజీనామా చేస్తానని పీసీసీ అధిష్టానానికి తేల్చిచెప్పినట్లు జంగా మాట్లాడిన ఆడియో బయటికి రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి సహా జనగామ నియోజకవర్గ టికెట్పై పొన్నాల వైఖరిపై జంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొన్నాల ఎవరినీ రాజకీయంగా ఎదగనివ్వలేదని.. ఎర్రమల్ల సుధాకర్ ఆయన రాజకీయాల్లోకి రాకముందే మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశారని, సెకండ్ క్యాడర్ను పైకి రానివ్వలేదని చెప్పుకొచ్చిన జంగా ఆయన కొడుకు, కోడలు కూడా ఆయనతో లేరని గుర్తుచేశారు. ఆయన సొంత ఊరు ఖిలాషాపురం రోడ్డు సహా నియోజకవర్గంలో ముఖ్యమైన రోడ్లన్నీ తానే మంజూరు చేయించాని చెప్పుకొచ్చారని ఆ విషయంలో పొన్నాల గుండెమీద చేయి వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు రూ.10కోట్ల కమీషన్ ఇచ్చా తప్ప.. ఆయన దగ్గర చాయ్ కూడా తాగలేదని ఫోన్ సంభాషణలో పేర్కొన్నారు.
పొన్నాలకు, కొండా మురళికి ఎవరికీ తాను శిష్యుడిని ఎంత మాత్రం కాదని స్పష్టం చేశారు. తనకు జనగామ ప్రాంతంలో ఆర్ఎస్యూ నేత సుధాకర్గాంధీ రాజకీయ గురువుగా పేర్కొన్న జంగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ కార్యకర్త నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగానని ఆడియో రికార్డులో బయటకు వచ్చింది. కొమ్మూరి ప్రతాప్రెడ్డికి టికెట్ రాకుండా చేసేందుకు పొన్నాల జంగా ఒక్కటయ్యారని ప్రచారం జరుగుతుందని ఆ కార్యకర్త ప్రస్తావించగా.. ఆయనతో కలిసేదిలేదని.. ఒకే పార్టీ కాబట్టి బయట పబ్లిక్లో చులకన కావద్దని ఓ ఫంక్షన్లో కలిసి మాట్లాడినట్లు పేర్కొన్నారు.