హనుమకొండ/వరంగల్ చౌరస్తా, నవంబర్ 27 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మం గళవారం వరంగల్కు సీఎం కేసీఆర్ రానున్నారు. తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజక వర్గాల ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. ములుగు రోడ్డులోని ఎల్బీ కళాశాలలో హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. కాగా, సభకు సంబంధించిన ఏర్పాట్లను చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, డీసీపీ బారి సోమవారం పరిశీలించారు.
సు మారు 10 ఎకరాలకు పైగా ఉన్న కాకతీయ మెడికల్ కళాశాల మైదానంలో లక్ష మందికి సరిపడా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు హెలికాప్టర్ ద్వారా ఎల్బీ కళాశాలకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కేఎంసీ లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకొని సభలో మాట్లాడనున్నారు.
సుబేదారి : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మంగళవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభకు వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పోలీసు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. సభ ప్రాగంణంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీపీ ట్రాఫిక్ పోలీసు అధికారులను ఆదేశించారు.