రేషన్ షాపుల ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యం తినలేక కొందరు అమ్ముకుంటున్నారు. దీంతో బియ్యం అక్రమ దందా, రీసైక్లింగ్ పెరిగింది. ఇది గమనించిన సీఎం కేసీఆర్ రేషన్ కార్డు కలిగిన వారందరికీ సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో అన్నపూర్ణ పథకాన్ని చేర్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిని అమలు చేయనున్నారు. ఇప్పటికే గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో భోజనం పెడుతుండగా కేసీఆర్ తాజా నిర్ణయంతో పేదలకు కడుపునిండా భోజనం అందనుంది. ఈ పథకం ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,23,560 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
ఇప్పటిదాక ఆర్థిక ఇబ్బందులతో రేషన్ షాపులో ఇచ్చే దొడ్డు బియ్యమే తింటానం. అప్పుడప్పుడు సుట్టాలత్తె సన్నం బియ్యం కొనుకొచ్చి వండిపెడతానం. సన్నబియ్యం రేటు బాగా ఎక్కువగా ఉంది. పేదోళ్లు కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు కేసీఆర్ సారు గెలిస్తే సన్నబియ్యం ఇత్తడట. కొనుక్కునే బాధ తప్పుతది. కడుపునిండా బువ్వ తింటం.
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 8(నమస్తే తెలంగాణ) : గరీబోళ్లకు ఇకపై సీఎం కేసీఆర్ సన్నబియ్యం అందించి వారి ఆకలి తీర్చబోతున్నారు. ఇప్పటి వరకు రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యం తినలేక ఇబ్బంది పడుతూ అమ్ముకుంటున్న వారు అనేకం ఉన్నారు. దీంతో బియ్యం అక్రమ దందా, రీసైక్లింగ్ దందా నడుస్తున్నది. పేదోళ్ల ఆకలి తీరడం లేదని గుర్తించిన సీఎం కేసీఆర్ రేషన్ కార్డు కలిగిన వారందరికీ సన్నబియ్యం అందించాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే ‘అన్నపూర్ణ పథకం’ ద్వారా అందించేందుకు మ్యానిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి రాగానే పథకం ప్రారంభం కానున్నది. ఇప్పటికే గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో భోజనం పెడుతుండగా కేసీఆర్ తాజా నిర్ణయంతో గరీబోళ్లకు భోజనం అందనుంది. ఈ పథకం ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,23,560 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. సర్కారు నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో అక్రమ దందాకు చెక్పడనుంది. బియ్యం రీసైక్లింగ్ పూర్తిగా ఆగిపోనుంది.
జిల్లాలో 1,23,560 మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వీరందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందించనున్నారు. భూపాలపల్లి మండలంలో 20,393 మంది లబ్ధిదారులు, చిట్యాల 11,339, గణపురం 11,383, కాటారం 11,396, పలిమెల 2,321, మహాముత్తారం 8,429, మహదేవపూర్ 10,057, మల్హర్ 8,871, మొగుళ్లపల్లి 11,581, టేకుమట్ల 8,566, రేగొండ మండలంలో 19,224 మంది లబ్ధిదారులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ సారు చెప్పింది చేత్తడు. ఇప్పటి దాక చెప్పినయన్నీ చేసుకుంట అచ్చిండు. రైతులకైతే దేవుడైండు. ఇప్పుడు గెలిచినంక రేషన్ దుకాణాలల్ల సన్న బియ్యం ఇత్తనంటండు. సన్నబియ్యం ఇత్తె మా లాంటి పేదోళ్లందరూ కడుపునిండ తింటరు. మళ్ల కేసీఆరే గెలుత్తడు.