నర్సంపేట, జనవరి 10 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం నర్సంపేటలో కంటి వెలుగుపై ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. దవాఖానలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అత్యున్నత వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా అందుబాటులోకి తేవడమే లక్ష్యమన్నారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి సమస్యలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు, మందులను అందిస్తుందన్నారు. అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్స కూడా చేయిస్తామని తెలిపారు. కరోనా కాలంలో సొంత ఖర్చులతో ఐసొలేషన్ సెంటర్ను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. రక్త దాన శిబరాలను నిర్వహించి 7800 యూనిట్ల రక్తం సేకరించామన్నారు. ఈ రెండో విడుత కంటి పరీక్షల శిబిరాలు వంద రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. రోజుకు మున్సిపాలిటీలో 400, గ్రామాల్లో 300 మందికి వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు. కంటి పరీక్షలు చేయించుకునే వారు రేషన్, ఆధార్, ఆరోగ్యశ్రీ కార్డు వెంట తీసుకుని రావాలని కోరారు. కలెక్టర్ గోపి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, డీఎంహెచ్వో వెంకటరమణ, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, డీఆర్డీవో సంపత్రావు, ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.