పర్వతగిరి, సెప్టెంబర్ 24: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మార్చిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం మండలంలోని అన్నారం షరీఫ్, దూపతండా, పెద్ద తండా, మోత్యాతండా, రావూరు, అనంతారాం గ్రామాల్లో రూ.15కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, వైకుంఠధామం, బీటీ రోడ్లు, చెక్డ్యామ్ బ్రిడ్జి, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, అంతర్గత సీసీరోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ పల్లెలు దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నాయన్నారు. రైతుబీమా, 24గంటల కరెంట్ సరఫరా, రైతు రుణ మాఫీతో రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన మహనీయుడు సీఎం కేసీఆర్, దళితబంధుతో దళితులు ఆర్థికంగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు.
కులవృత్తులు, చేతివృత్తులకు ఆపన్నహస్తం అందించి ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మహిళా సంక్షేమం, విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నామని, పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధి మన కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అన్నివర్గాల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే మార్గదర్శిగా నిలుపుదామన్నారు. జడ్పీటీసీ సింగ్లాల్, ఎంపీపీ కమలా పంతులు, పీఏసీఎస్ చైర్మన్లు మోటపోతుల మనోజ్గౌడ్, గొర్రె దేవేందర్, సర్పంచులు యశోదాబాబు, లక్ష్మీ, గణేశ్, జ్యోతి రవి, సంతోశ్గౌడ్, తౌటి దేవేందర్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, పార్టీ మండల అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, సర్వర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే అరూరికి ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లు, కోలాటాలు, డీజే పాటలతో సందడి చేశారు.
అన్నారం షరీఫ్ దర్గాలో ప్రార్థనలు
అన్నారం షరీఫ్ దర్గాలో ఆదివారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలుపొందాలని మొక్కుకున్నారు. ఫాతియా సమర్పించి బాబాకు మొక్కులు చెల్లించారు. దర్గా ముజావర్ పాషా నేతృత్వంలో ప్రార్థనలు చేశారు.