కరీంనగర్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ‘పాడి కౌశిక్రెడ్డి నా కొడుకులాంటోడు.. ఈటల రాజేందర్ పార్టీలోకి రాకముందే వీళ్ల నాన్న పాడి సాయినాథ్రెడ్డి బీఆర్ఎస్ జెండా మోసిండు.. హుజూరాబాద్లో కౌశిక్రెడ్డిని గెలిపించండి.. మీకు అండగా ఉంటా.. అన్నీ చేసిన నన్ను కాదని.. ఇంకెవన్నో ఎత్తుకుంటే మంచిదా? ఒకసారి ఆలోచించండి.. మంచి ఏదో.. చెడు ఏదో ఆలోచించాల్సిన అవసరం ఉంది’ అని సీఎం కేసీఆర్ సూచించారు. శుక్రవారం జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గతంలో మనకు ఏం చేసిందో మీకు తెలుసని, కాంగ్రెస్ను నమ్మి 2004లో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఇవ్వకండా అనేక మంది బలిదానాలకు కారణమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ మనల్ని మోసం చేసిందని, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చట్టాన్ని అతిక్రమించిందని, ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాల్సి ఉండగా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో 157 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నవోదయ పాఠశాలలు, మెడికల్ కళాశాలల కోసం వంద లేఖలు రాశానని గుర్తు చేశారు.
కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారని, తెలంగాణలో నేను ఒప్పుకోకపోతే ఏడాదికి రూ.5 వేల కోట్ల చొప్పున ఇప్పటి వరకు రూ.25 వేల కోట్లు కోతలు పెట్టారని తెలిపారు. హుజూరాబాద్లో గెలిచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఈటల రాజేందర్ వీటి గురించి ఎందుకు మాట్లాడడని ప్రశ్నించారు. కౌశిక్రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి అని, బీఆర్ఎస్ అంటే పేదల పార్టీ అని స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి గెలిచిన ఈటల రాజేందర్ నియోజవర్గానికి ఏమీ చేయలేదని, యువకుడు, సమర్థుడైన కౌశిక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రైతు బంధు, 24 గంటల కరెంట్ రావాలన్నా, ధరణి కొనసాగాలన్నా కౌశిక్రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే హుజూరాబాద్లో కౌశిక్రెడ్డి గెలవాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి తాను ఏం తక్కువ చేయలేదని, పదేళ్లలో అన్ని సమకూర్చామని, ప్రతి రైతుకు రైతుబంధు ఇచ్చామని, దళితులందరికీ దళితబంధు ఇచ్చామని గుర్తు చేశారు. ఇదే జోష్ను ఈ నెల 30 వరకు కొనసాగించి బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.
ఈ ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకొనైనా రూ.వెయ్యి కోట్ల నిధులు తెస్తా. కమలాపూర్ మండలంలోని శనిగరం, ఉప్పల్, జమ్మికుంట మండలంలోని వావిలాల, వీణవంక మండలంలోని చల్లూరును మండలాలుగా ప్రకటించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లా. ఆయన కూడా సానుకూలంగా ఉన్నరు. ఈటల రాజేందర్ను పెద్ద నాయకుడిని చేస్తే.. ఆయన కేసీఆర్కు వెన్నుపోటు పొడిచిండు. హుజూరాబాద్లో 2004 నుంచి గెలిపిస్తున్న ఈటలను ఇక్కడి ప్రజలకు కూడా ధోకా ఇచ్చే విధంగా గజ్వేల్ ఆయన సొంతూరని చెబుతున్నడు. అక్కడ.. ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్న ఆయనకు తగన బుద్ధి చెప్పాలె. ఇక్కడ ఎవరినో గెలిపిస్తే అభివృద్ధి ఎలా సాధ్యం. 15 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నా. ఒకే ఒక్క అవకాశం నాకిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపెడ్తా. గత నాయకుడి లెక్క.. రంగులు మార్చెటోన్ని కాదు.