హనుమకొండ/రఘునాథపల్లి/గీసుగొండ/జనగామ చౌరస్తా, ఏప్రిల్ 16: సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు సత్తాచాటారు. ఉమ్మడి జిల్లా నుంచి ఐదురుగు ప్రతిభ చాటి మెరుగైన ర్యాంకులు సాధించారు. జనగామకు చెందిన కౌశిక్ మొదటి ప్రయత్నంతోనే 82వ ర్యాంకు సాధించగా, మరికొందరు మెరుగైన ర్యాంకులతో మెరిశారు. పట్టుదలతో చదవి ఎన్నో ఏళ్లకలను నిజం చేసుకున్న వారిని అందరూ అభినందనలతో ముంచెత్తారు.
హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డికి సివిల్స్లో 104వ ర్యాంకు వచ్చింది. ఇతడికి గతేడాది 217 ర్యాంకు రావడంతో ఐపీఎస్కు ఎంపికయ్యాడు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా పనిచేస్తుండగా, తల్లి లక్ష్మి గృహిణి.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన కొయ్యడ ప్రణయ్ కుమార్ రెండో ప్రయత్నంలో 554వ ర్యాంకు సాధించి సివిల్స్కు ఎంపికయ్యాడు. ఇతడి తల్లిదండ్రులు కొయ్యడ ప్రభాకర్-లక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లారు. వారి మూడవ కుమారుడైన ప్రణయ్ కుమార్ గజ్వేల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్, కూకట్పల్లి జేఎన్టీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చదివాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్టడీ సరిల్లో చేరి సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. గతేడాది 885వ ర్యాంకు సాధించాడు.
జనగామ పట్టణానికి చెందిన బిల్డర్ మెరుగు సుధాకర్-సుజాత దంపతుల కుమారుడు కౌశిక్ ఆల్ ఇండియాలో 82వ ర్యాంకు సాధించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి ఢిల్లీలోని ఐఐఎఫ్టీలో ఎంబీఏ చదివాడు. అనంతరం సివిల్స్ కోచింగ్ తీసుకొని మొదటి ప్రయత్నంలోనే అనుకున్న ర్యాంకును పొందాడు. 15 ఏళ్ల నుంచి ఈ కుటుంబం హైదరాబాద్లోని హబ్సిగూడలో నివాసముంటోంది.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సయింపు ప్రభాకర్-జయలక్ష్మీ కుమారుడు కిరణ్ గతంలో సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్లో అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేశాడు. అనంతరం ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీ(ఐఐఎస్)లో అసిస్టెంట్ డైరెక్టర్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిగా అవకాశం వచ్చింది. చివరి ప్రయత్నంగా 568వ ర్యాంకు సాధించి అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాడు. కాగా కిరణ్, 5వతరగతిలో జవహర్ నవోదయ ఎంట్రెన్స్ పరీక్ష రాసి వరంగల్ మమునూరులోని నవోదయ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేశాడు. అక్కడి నుంచి ఇంటర్ గుంటూరు భాష్యం కళాశాలలో, 2017లో ఢిల్లీ ఐఐటీలో బీటెక్ చదివాడు. అదేవిధంగా వరంగల్ శివనగర్కు చెందిన అనిల్కుమార్కు 764 ర్యాంకు వచ్చింది. ఈ సందర్భంగా సివిల్స్లో ర్యాంకులు సాధించిన వారిని పలువురిని అభినందించారు.