హనుమకొండ, జనవరి 25 : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధనకు కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాడుతామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఐక్య ఉద్యమానికి సీపీఐ మద్దుతు కోరుతూ మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని భారతీయ కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాతూ గురువారం ఉదయం 11 గంటలకు కాజీపేటలోని ఫ్యారడైజ్ ఫంక్షన్హాల్లో వివిధ రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని అంశాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ప్రాజెక్టులు, మంజూరు కావాల్సిన నిధులపై ఈ ప్రాంత బీజేపీ ఎంపీలు, నాయకులు ఏనాడూ నోరెత్తలేదని మండిపడ్డారు. జాతీయ హోదాకు అన్ని అర్హతలున్న కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు, మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వరంగల్ నగరంపై ప్రేమ ఉంటే బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెప్పించడానికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏడేళ్ల క్రితం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం సాయం చేయాల్సింది ఎంత? చేస్తున్నది ఎంత అని చీఫ్ విప్ ప్రశ్నించారు. విభజన చట్టంలో అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు పలుమార్లు సమర్పించిన విజ్ఞాపన పత్రాలను సైతం బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై ఆరోపణలు, విమర్శలు, దుష్ప్రచారం చేయడం తప్పా పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఎంపీల తరహాలో పార్టీలకు అతీతంగా నిలబడి తెలంగాణకు ఎందుకు సాయం చేయరని ప్రశ్నించారు. ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, విభజన చట్టంలోని హామీలకు భారీగా నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భేటీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తకళపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి రవి, టీఆర్ఎస్, సీపీఐ పార్టీల నాయకులు పాల్గొన్నారు.