వరంగల్చౌరస్తా, మే 12: నర్సింగ్ సేవల మాతృమూర్తి ఫ్లోరెన్స్ నైటింగెల్ జయంతిని పురస్కరించుకొని ఎంజీఎం, కాకతీయ సూపర్స్పెషాలిటీ దవాఖానల్లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎంసీ ఆవరణలోని సూపర్స్పెషాలిటీ దవాఖానలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం ఫ్లోరెన్స్ నైటింగెల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సేవలు అందించడం నోబల్ వృత్తి అంటారన్నారు. అలాంటి వృత్తిని ఎంచుకొని సేవలు అందిస్తున్న నర్సింగ్ సిబ్బందిని ఆయన అభినందించారు. అలాగే, ఎంజీఎం నర్సింగ్ హాస్పిటల్ ఆవరణలోని ఫోరెన్స్ నైటింగెల్ విగ్రహానికి నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ వీణ వెంకట్, డాక్టర్ దీపక్రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ సుశీల, హెడ్ నర్సులు మార్గనెట్, చిన్నమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సన్మానం
చెన్నారావుపేట: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి సరోజతోపాటు పీహెచ్సీ పరిధిలో పని చేస్తున్న నర్సులను ఘనంగా సన్మానించారు. ఆత్మైస్థెర్యం, అంకితభావంతో వైద్య సేవలు అందిస్తున్న నర్సులందరికీ ఈ సందర్భంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కుండె మల్లయ్య, సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, ఖాదర్పేట సర్పంచ్ అనుముల కుమారస్వామి, వార్డు సభ్యులు గొడిశాల సురేందర్, బీఆర్ఎస్ మండల నాయకులు మహేందర్రెడ్డి, కూస రవి, నర్మెట్ట యాదగిరి, వైద్య సిబ్బంది స్వరూపారాణి, హేమలత, కవిత, సుధారాణి, పుష్ప, రమ పాల్గొన్నారు.
నర్సుల సేవలు వెలకట్టలేనివి
నర్సంపేట: అంకితభావంతో పని చేస్తున్న నర్సుల సేవలు వెలకట్టలేనివని నర్సంపేట జిల్లా దవాఖాన అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ మనోజ్లాల్ అన్నారు. పట్టణంలోని దవాఖానలో నర్సుల దినోత్సవాన్ని తెలంగాణ ఆటో యూనియన్ అధ్యక్షుడు కల్లెపెల్లి సురేశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నర్సులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం డాక్టర్ మనోజ్లాల్ మాట్లాడుతూ ఆత్మైస్థెర్యంతో రోగులకు సేవలు అందిస్తున్న నర్సులు అభినందనీయులన్నారు. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ప్రజలకు ఎంతో ధైర్యంగా, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నర్సులు సేవలు అందించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో డాక్టర్ నవత, నర్సింగ్ సూపరింటెండెంట్ రమాదేవి, స్నేహ, ప్రావీణ్య, శారద, జహర, వనజ, సులోచన, తాడు పట్టణ అధ్యక్షుడు ఇస్త్రం కుమార్, నర్సులు పాల్గొన్నారు.