వరంగల్ చౌరస్తా, మార్చి11: ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న మహిళలు అన్ని రంగాల్లో మరింతగా రాణించాలని మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మహిళా విభాగం చైర్మన్ డాక్టర్ హరి సంధ్యారాణి ఆధ్వర్యంలో శనివారం ఐఎంఏ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మేయర్తోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేవతి, ఐఎంఏ వరంగల్ అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని గుర్తుచేశారు. ముఖ్యంగా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో మహిళలు నైపుణ్యాలను ప్రదర్శించడంతోపాటు తమ ఆదిపత్యాన్ని ప్రదర్శించే స్థాయికి చేరుకున్నారని కొనియాడారు. అదేస్థాయిలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. భవిష్యత్లో పురుషులకు పోటీగా నిలువడానికి మహిళలు కృషి చేయాలని సూచించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేవతి మాట్లాడుతూ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసే చట్టాలను రూపొందించడానికి, వాటిని అమలు చేయడానికి అవసరమైన పరిపాలనా విభాగాల్లో మహిళలు మరింత రాణించాలన్నారు. అనంతరం ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ మేయర్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఐఎంఏ మహిళా విభాగం వరంగల్ సభ్యులు డాక్టర్ అంజని, డాక్టర్ కస్తూరి ప్రమీల, డాక్టర్ రాధిక, డాక్టర్ బేతి కవిత పాల్గొన్నారు.
మహిళలకు సెమినార్
పోచమ్మమైదాన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సౌత్ ఇండియా బిదాల్ మేకప్ స్టూడియో, మేకప్ క్రష్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని ఉర్దూ షాదీఖాన భవనంలో లుక్ అండ్ లెర్న్ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్బీఎంఎస్ డైరెక్టర్ రాఘవీరెడ్డి, ఫౌండర్ ఆఫ్ వరల్డ్ బ్యూటీషియన్ డైరెక్టర్ నాజియా ఉజ్మా, డిప్యూటీ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు గుండు చందనా పూర్ణచందర్, ఆర్ విజయశ్రీ, ఆడెపు స్వప్న, వరంగంటి అరుణకుమారి, తూర్పాటి సులోచన, మాజీ కార్పొరేటర్ శారద సురేశ్జోషి పాల్గొన్నారు.
సాధించలేనిది ఏదీ లేదు..
నర్సంపేటరూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనని స్త్రీసంఘటన పత్రిక ఎడిటర్ ఎం లక్ష్మి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం పీవోడబ్ల్యూ, స్త్రీ సంఘటన జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో నర్సంపేటలోని వాసవీ కల్యాణ మండపంలో ఈర్ల పద్మ అధ్యక్షతన శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. రోజురోజుకూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు మరింత భారంగా మారాయని ఆవేదన వ్యక్త చేశారు. మహిళలు కుటుంబ పోషణ కోసం సర్వశక్తులను ఉపయోగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ సంఘటన రాష్ట్ర కార్యదర్శి మోడెం శ్రీలత, డాక్టర్ మోతె నవత, మహిళా విభాగం జిల్లా నాయకులు మేక దేవేంద్ర, ఈరెల్లి శారద, పద్మ, స్వప్న, వనక్క, మమత, అనిత, శోభ, రాధిక, సుజాత, శ్రీలత, శ్రీజ పాల్గొన్నారు.
ఆదర్శ మహిళా రైతులకు సన్మానం
రాయపర్తి: బాలాజీతండాలో తెలంగాణ రాష్ట్ర గోశాలల ఫెడరేషన్, శివశక్తి గోశాలలు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించాయి. ఈ సందర్భంగా గ్రామంలో వ్యవసాయంలో రాణిస్తున్న పలువురు ఆదర్శ మహిళా రైతులను పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో తెలంగాణ గోశాల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ గోశాలల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాడిపల్లి రాజేశ్వర్రావు, సర్పంచ్ బానోత్ కౌసల్యా హనుమానాయక్, ఫెడరేషన్ కార్యాలయ సూపరింటెండెంట్ దుర్గం రోజా, గోశాల అధ్యక్షుడు లావుడ్యా మాంజ్యానాయక్, భాస్కర్నాయక్ పాల్గొన్నారు.
మహిళలకు చీరెలు, పండ్ల పంపిణీ
ఖిలావరంగల్: పడమర కోటలో కాకతీయ రుద్రమాంబ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరెలు, పండ్లు పంపిణీ చేశారు. సొసైటీ అధ్యక్షురాలు బైరబోయిన సరోజనయాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో న్యాయవాది పోలెపాక చంద్రకళ, 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, సింగారపు అరుణ, తోట చంద్రకళ, చింతం రజిని, మంద శోభ, ధనలక్ష్మి, అనసూర్య, నాగరాణి, అనిత, కవిత పాల్గొన్నారు.