జనగామ, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతున్నది అత్తకు పౌరసత్వం తిరస్కరణకు గురైతే కోడలికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్కు మరోసారి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కనీసం ఏడాది పాటు దేశంలో ఉంటేనే ఇక్కడి సిటిజన్షిప్కు అర్హతగా పేర్కొంటూ పాలకుర్తి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఎన్నారై ఝాన్సీరెడ్డి భారతదేశ పౌరసత్వాన్ని అధికారులు గతనెలలో తిరస్కరించారు. దీంతో ఆమె తన కోడలు మామిడాల యశస్వినిరెడ్డి పేరును ప్రతిపాదించి అధిష్టానం ద్వారా అభ్యర్ధిగా ప్రకటించుకొని నామినేషన్ దాఖలు చేసి, టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో ఎన్నికల బహిరంగసభ కూడా నిర్వహించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా గురువారం పాలకుర్తి రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ సింగ్ వద్ద నామినేషన్ దాఖలు చేసిన యశస్వినిరెడ్డి సరైన తాజా ఓటరు గుర్తింపు పత్రాలు అందజేయలేదు. నాగర్కర్నూల్ జిల్లా దిండిచింతలపల్లి గ్రామ ఓటరుగా నమోదైన తాజా ధ్రువపత్రాన్ని ఆమె శుక్రవారం ఆర్వోకు సమర్పించారు.
అయితే యశస్వినిరెడ్డి పాస్పోర్టులో మాత్రం హైదరాబాద్ చిరునామాను పేర్కొంటూ అక్కడి ఓటరు గుర్తింపుకార్డును పొందుపరిచినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసి, ఓటుపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు, సంబంధిత జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అయినా కాంగ్రెస్ అధిష్టానం మొండిగా ఆమెకే పాలకుర్తి అభ్యర్థిగా బీఫారం ఇచ్చింది. నామినేషన్ల పరిశీలనలో యశస్వినిరెడ్డి దరఖాస్తులో పొందుపరిచిన అంశాల్లో సాంకేతిక సమస్యలతో నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఓటు హక్కు ఉన్న ప్రాంతంలో వరుసగా 180రోజులు స్థిర నివాసం ఉండాలనే నిబంధన ఉంది. యశస్వినిరెడ్డికి తాను పుట్టిన చోటుతోపాటు హైదరాబాద్లో కూడా ఓటు హక్కు ఉన్నట్లు కోర్టులో పిటిషనర్ ఆధారాలను చూపడంతో ఆమె నామినేషన్ వివాదంలో చిక్కుకునే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ఆమె పోటీలో ఉంటారా? లేదా అన్న విషయం ఈ నెల 13న తేలనుండగా కాంగ్రెస్ శ్రేణులు ఆయోమయంతో ఎవరిదారి వారు వెతుక్కునే పనిలో పడ్డట్లు తెలుస్తున్నది.
యశస్వినిరెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురైతే అభ్యర్థిని మార్చేందుకు వీలుగా బీ-పారంతో పాటు ఏ-ఫారం కూడా తాజాగా రిటర్నింగ్ ఆధికారికి అందజేశారు. పంథనికి చెందిన టీ-పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్తో నామినేషన్ వేయించారు. అయితే ఆయనతోపాటు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమిపాలై వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడ్డ జంగా రాఘవరెడ్డి పేరు ఆకస్మికంగా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొంటూ జంగా పేరిట ఆయన అనుచరులు శుక్రవారంనామినేషన్ పత్రాలు దాఖలు చేయడం పాలకుర్తి కాంగ్రెస్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పినట్లయింది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్పై దుమ్మెత్తిపోసిన జంగా, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఉంటారా? లేక ఆయనే పార్టీ అభ్యర్థిగా మారుతాడా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.