సన్న బియ్యం కొందామంటే వెన్నులో వణుకు పుడుతున్నది. వారంలోనే క్వింటాల్పై సుమారు రూ.800 దాకా పెరగడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నది. కిలో బియ్యం రూ.52 నుంచి రూ.60దాకా ధర ఉండడం, త్వరలోనే రూ.100కు కూడా చేరే అవకాశాలు ఉండడంతో మరింత గుబులు పుట్టిస్తున్నది. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకొని బియ్యాన్ని ‘బ్లాక్’ చేస్తూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలకుండా చూసి అందుబాటు ధరకే అందరికీ బియ్యం అందేలా చూడాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
హనుమకొండ, డిసెంబర్ 14 : బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజుల్లోనే క్వింటాల్పై సుమారు రూ.800 దాకా పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పండించిన సన్నాలను ఇతర రాష్ర్టాలకు తరలిస్తుండడం, మిల్లర్లు, స్టాకిస్టులు, దళారులు నేరుగా రైతుల వద్ద సన్న బియ్యాన్ని కొని ‘స్టాక్’ చేస్తూ ధరలు నిర్ణయిస్తుండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకొని మిల్లర్లు, స్టాకిస్టులు, బియ్యం వ్యాపారులు భారీగా ధరలు పెంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతేడాది క్వింటాల్ బియ్యం రూ.3వేలు ఉంటే ఇప్పుడు రూ.4వేల నుంచి రూ.6,500 వరకు పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. మార్కెట్లో పాతవి జై శ్రీరాం కిలో బియ్యం రూ. 80, సోనా మసూరి రూ.64, హెచ్ఎంటీ రూ. 64 ఉండగా కొత్త బియ్యం రూ. 52 నుంచి రూ. 60, విజయ మసూరి లాంటి వాటికి రూ. 40 నుంచి రూ. 50 వరకు ధర పలుకుతోంది. మున్ముందు కిలో బియ్యం ధర రూ. 100కు చేరే అవకాశముందని రైస్ మిల్లర్లు అంటున్నారు. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సన్నాలకు చీడ, తెగుళ్లు సోకి దిగుబడి తక్కువ రావడం, ఇతర రాష్ర్టాల్లో సన్నాలను పండించక పోవడం, మన రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో దిగుబడి తగ్గడం, ఒక్క గోదావరి బెల్టులోనే సన్నాలు పండుతున్నా సరిపడా అందుబాటులోకి రాకపోవడం, రోజురోజుకూ డిమాండ్ పెరగడంతో మిల్లర్లు, స్టాకిస్టులు, వ్యాపారులు సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బియ్యం ధరలపై సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే వ్యాపారులు ధరలు పెంచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సన్నరకం ధాన్యం కొత్తవి క్వింటాల్కు రూ.3వేలు, పాతవి రూ. 3,700 ఆల్టైమ్ రికార్డుకు చేరాయని ఓ రైస్ మిల్లర్ తెలిపారు. రోజురోజుకూ బియ్యం ధర ఇలా అమాంతం పెరుగుతుంటే కొనేది ఎట్లా అని సామాన్యులు వాపోతున్నారు.
పదిహేను రోజులుగా బియ్యం వ్యాపారం తగ్గింది. రోజురోజుకూ సన్న బియ్యం ధరలు భారీగా పెరుగుతుండడంతో కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. రోజుకు సుమారు 15క్వింటాళ్ల వరకు అమ్మేవాళ్లం. ఇపుడు 5 క్వింటాళ్లుకూడా అమ్మడం లేదు. బియ్యం ధర రోజుకు రూ.వంద నుంచి రూ.200దాకా పెరుగుతోంది.
సన్న బియ్యం వినియోగం పెరగడం వల్లే ధరలు పెరుగుతున్నాయి. డిమాండ్కు తగినట్లుగా సన్నాలు అందుబాటులో లేవు. రైతులు దొడ్డు రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇతర రాష్ర్టాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సన్నరకం ధాన్యం దిగుబడి సైతం తగ్గిపోయింది.
ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధరలు చూస్తుంటే భయమవుతోంది. సామాన్యులు అసలు సన్న బియ్యం కొనలేని పరిస్థితి వచ్చింది. గత సంవత్సరం కిలో బియ్యం రూ. 30 ఉంటే ఇప్పుడు రూ.60కి పైనే ఉంది. ఇంత రేటు పెట్టి ప్రజలు బియ్యం ఎలా కొంటారు? ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి అందరూ ఇబ్బంది పడుతున్నారు. తినే బియ్యం కూడా కొనలేని పరిస్థితి వస్తే ఎట్లా బతుకుడు? అధికారులు చొరవ తీసుకొని బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలకుండా చూడాలి. సామాన్యులకు అందుబాటు ధరకే సన్న బియ్యం దొరికేలా చూడాలి. సంపతి రఘు, హనుమకొండ