వర్ధన్నపేట, ఫిబ్రవరి 25: వర్ధన్నపేట మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ అంచనా ఆదాయ వ్యయాల తుది నివేదికపై కలెక్టర్ గోపి, అడిషనల్ కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడే సమక్షంలో సమగ్రంగా చర్చించారు. 4వ వార్షిక బడ్జెట్ సాధారణ సమావేశం శనివారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం, వ్యయాలకు సంబంధించిన నివేదికను సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్ సమర్పించారు. ఈ నివేదికపై కలెక్టర్ పాలకమండలితో సమగ్రంగా చర్చించారు. అలాగే, వార్డుల వారీగా వచ్చే, ఏడాదిపాటు చేపట్టనున్న అభివృద్ధి పనులపై కూడా పాలక మండలితో చర్చించి నివేదికను తయారు చేశారు.
2023 వార్షిక బడ్జెట్లో ఇంటి పన్నుల ద్వారా రూ. 2.28 కోట్లు, నీటి పన్నుల ద్వారా రూ. 13.20 లక్షలు, ఇతరాల ద్వారా రూ. 44.10 లక్షలు కలిసి మొత్తంగా రూ. 2.85 కోట్ల ఆదాయం రానున్నట్లు అంచనా వేశారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 15వ ఫైనాన్స్ గ్రాంట్స్, పట్టణ ప్రగతి, ఎస్ఎఫ్సీ ద్వారా మరో రూ. 1.95 కోట్లు రానున్నాయని వెల్లడించారు. దీంతో మొత్తం 2023-24 వార్షిక ఆదాయం రూ. 4.81 కోట్లు రానున్నదని అంచనా బడ్జెట్ తయారు చేశారు. అలాగే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 75 లక్షలు సిబ్బంది జీతాలు, వీధి దీపాలు, ఈఈఎస్ఎల్, సీసీ చార్జీలకు రూ. 13.70 లక్షలు, పారిశుధ్య పనుల నిర్వహణ, తాగునీటి సరఫరాకు రూ. 30 లక్షలు, మోటర్ల నిర్వహణ, లోన్ రికవరీ, ఇతరాలకు రూ. 44.90 లక్షలు, హరితహారం, నర్సరీలు, పట్టణ ప్రకృతి వనాల నిర్వహణకు రూ. 28.50 లక్షలు, పరిపాలనా ఖర్చులు రూ. 35.60 లక్షలు, టౌన్ప్లానింగ్ రూ. 2.30 లక్షలు, అభివృద్ధి పనులకు రూ. 35 లక్షలు, 1/3 బ్యాలెన్స్ బడ్జెట్ రూ. 18.43 లక్షలు, గ్రాంట్స్ వ్యయం రూ. 1.95 కోట్లుగా అంచనా వేశారు.
ఆదాయంలో వ్యయం పోగా.. 1.87 లక్షల మిగులు బడ్జెట్గా అధికారులు అంచనా నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను సాధారణ బడ్జెట్ సమావేశంలో మున్సిపల్ పాలక మండలితో ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడే ఆధ్వర్యంలో సమగ్రంగా చర్చించిన అనంతరం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
పట్టణాల ప్రగతికి భారీగా నిధులు
రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల ప్రగతికి భారీగా నిధులు కేటాయిస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మున్సిపల్ సాధారణ బడ్జెట్ సమావేశం అనంతరం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఫిరంగిగడ్డ వరకు రూ. 8 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్, డివైడర్, ఇతర అభివృద్ధి పనులను కలెక్టర్ గోపితో కలిసి ఆయన ప్రారంభించారు. పట్టణం త్వరగా అభివృద్ధి చెందాలంటే ఆదాయ వనరులను ఎక్కువగా సమకూర్చుకోవాలని అరూరి సూచించారు. ప్రధానంగా పన్నులను క్రమపద్ధతిలో వసూలు చేయడంతోపాటు పట్టణం శుభ్రంగా ఉండేలా చర్యలు చేపడుతూ పచ్చదనం పెంపొందించుకోవాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.
పట్టణంలో మెరుగైన వసతులు కల్పిస్తేనే ప్రజలు కూడా పన్నులు వంద శాతం చెల్లిస్తారని సూచించారు. అలాగే, బడ్జెట్ అంచనా నివేదిక ఆధారంగా అధికారులు, పాలక మండలి సమన్వయంతో పని చేస్తేనే నివేదిక అమలుకు సాధ్యం అవుతుందన్నారు. పాలక మండలి సభ్యులు నిత్యం ప్రజల మధ్య ఉండాలన్నారు. పట్టణాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, కౌన్సిలర్లు రాజమణి, రవీందర్, రామకృష్ణ, సుధీర్, పద్మ, సుజాత, అధికారులు పాల్గొన్నారు.