దుగ్గొండి, మార్చి 28 : విపక్షాల అబద్ధపు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని గొల్లపల్లిలో పది గ్రామాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు దుర్నీతిని ఎండగట్టాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలది అన్నం పెట్టేటోడికి సున్నం పెట్టే సంస్కృతి అని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీలది అన్నం పెట్టేటోడికి సున్నం పెట్టే సంస్కృతి అని, ఆ పార్టీలను తరిమికొట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. మంగళవారం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో మల్లంపల్లి, మహ్మదాపురం మర్రిపల్లి స్వామిరావుపల్లి, గొల్లపల్లి, చంద్రయ్యపల్లి, గుడ్డెలుగుల పల్లి, తిమ్మంపేట, నారాయణతండా, బొబ్బరోనిపల్లి గ్రామాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలో తీసుకు రావాలన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతూ నిధులకు కోత పెడుతున్నా సీఎం కేసీఆర్ మొక్కవోని పట్టుదలతో పేదలకు సంక్షేమ పథకాలను అందస్తున్నారని స్పష్టం చేశారు. గోదావరి నీళ్లకు నియోజక వర్గానికి తీసుకువచ్చి బీడు భూములను సస్యశామలం చేశారన్నారు. అలాగే, ఇక్కడి రైతాంగానికి సీఎం సహకారంతో వ్యవసాయ పరికరాలు, సబ్సిడీపై మోటర్లు, పైపులు అందించానని చెప్పారు. నర్సంపేట నియోజకవర్గానికి ప్రత్యేక నిధులతో పాటు పంట నష్ట పరిహారం అందించేందుకు కృషి చేశానన్నారు. ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధమేనని తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా వడగండ్ల వానతో నష్టపోయిన పంటలను పరిశీలించి వెంటనే నష్ట పరిహారం అందించడం చరిత్రలోనే తొలిసారన్నారు. అసెంబ్లీలో ఈజీఎస్ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తీర్మానం చేసింది తానేనన్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్న విపక్ష నాయకులను నిలదీయాలి..
మతతత్వ పార్టీల అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టేందుకు ప్రతి కార్యకర్త నడుం కట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ యాత్రల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్న నాయకులను గ్రామాల్లో నిలదీయాలని సూచించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్రెడ్డి, బండి సంజయ్ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల, వైస్ ఎంపీపీ పల్లాటి జేపాల్రెడ్డి, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ నాయకుడు రాజ్కుమార్ శానబోయిన, క్లస్టర్ ఇన్చార్జిలు ఊరటి మహిపాల్రెడ్డి, మేరుగు రాంబాబు, శంకేసి కమలాకర్, నీలం పైడయ్య, పల్లాటి కేశవరెడ్డి, రేవూరి సురేందర్రెడ్డి, రాజు, బొమ్మగాని వెంకన్న, ఆరెల్లి చందనా నరేందర్ పాల్గొన్నారు.
గ్యాస్ ధర పెంచిన పాపం బీజేపీదే..
– గట్టమల్లు, వృద్ధురాలు, గొల్లపల్లి గ్రామం
గ్యాస్ ధర పెంచి పేదోళ్ల ఉసురు పోసుకున్న పాపపు పార్టీ బీజేపీ. రూ.1200 వందలు కట్టలేక కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటున్నా. ఎమ్మెల్యే రూ.650కే ఇంటింటికీ పైపు ద్వారా గ్యాస్ అందిస్తానని చెప్పడంతో ధైర్యం వచ్చింది. సీఎం కేసీఆర్ ఇస్తున్న పింఛన్లో రూ.1200 గ్యాస్ సిలిండర్కు కట్టుడు అయితాంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తరిమికొట్టి కేసీఆర్ను గెలిపించాలి.