జనగామ, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)/ స్టేషన్ఘన్పూర్/చిల్పూరు : చిల్పురు మండలం రాజవరం గ్రామం కన్నీటి సంద్రమైంది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి అంత్యక్రియలు వేలాది మంది అశ్రునయనాల నడుమ మంగళవారం ముగిశాయి. అంతిమయాత్రలో బీఆర్ఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని పాగాల పార్థివదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు.
అనంతరం విలేకరులతో కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్రెడ్డి హఠాన్మరణం బాధాకరమన్నారు. 14ఏండ్లు కేసీఆర్ వెంట ఓ సైనికుడిలా ఉండి పని చేశారని, ఆయన మరణం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తను కలచి వేసిందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సంపత్రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తూ విజయవంతం చేశారని గుర్తుచేశారు. సంపత్రెడ్డి కుటుంబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జడ్పీ అధ్యక్షులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, శ్రేణులు పార్టీ కార్యాలయాల్లో పాగాలకు ఘనంగా నివాళులర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలోనూ జనగామ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసిన పాగాల హఠాన్మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇంత చిన్న వయస్సులో దూరం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆయన కుమార్తె చదువు బాధ్యత సహా ఆర్థికంగా పార్టీ తరఫున చూసుకుంటామని భరోసానిచ్చారు.
దగ్గరుండి అంత్యక్రియలు జరిపించిన పల్లా, కడియం..
పాగాల సంపత్రెడ్డి సోమవారం సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడువగా, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి హుటాహుటిన రాజవరం చేరుకొని అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంపత్రెడ్డి అంత్యక్రియల్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూసుకుంటూ కుటుంబ సభ్యుల వెన్నంటి ఉండి వారికి ధైర్యాన్నిచ్చారు. సంపత్రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బండా ప్రకాశ్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, మార్నేని రవీందర్రావు, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రాజవరంలోని ఇంటి నుంచి తమ వ్యవసాయ క్షేత్రం వరకు సాగిన అంతిమయాత్రలో పల్లా, కడియం సహా ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొని సహచరుడికి తుది వీడ్కోలు పలికారు.
పాగాల మృతి బాధాకరం
ఉద్యమంలో సంపత్రెడ్డి చురుకైన పాత్ర పోషించారు. నిబద్ధత గల నాయకుడిగా సేవలందించారు. ఆయన అకాల మరణం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆయన ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. బీఆర్ఎస్ కుటుంబానికి, జనగామ జిల్లాకు ఆయన మరణం తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ఆత్తస్థయిర్యం కలిగించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా..
-పల్లా రాజేశ్వర్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
దురదృష్టకరం
మలిదశ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన పాగాల సంపత్రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేశారు. అభివృద్ధి ఫలాలను జిల్లా ప్రజలకు అందించారు. రెండు దశాబ్దాలకు పైగా గులాబీపార్టీతో ఆయనకు అనుబంధం ఉన్నది. ఆయన మరణం జిల్లాకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.
-కడియం శ్రీహరి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే