హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 28 : ఎన్నికలు వస్తేనే కనిపించే కాంగ్రెస్, బీజేపీ నాయకులు నాపై అనవసర ఆరోపణలు చేస్తుంటే దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ హంటర్రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృస్థాయి సమావేశం నిర్వహించారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చీఫ్ విప్ మాట్లాడుతూ ఉద్యమనేత, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రతి పక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. కాకతీయ యూనివర్సిటీ భూములు ఎవరు కబ్జా చేశారో ప్రజలకు తెలుసు అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ మద్యనిషేధం విధిస్తే దొంగచాటున బాటిళ్లు అమ్ముకుని పోలీస్స్టేషన్లకు వెళ్లిన నాయకులు, ఇందిరమ్మ ఇల్లు అమ్ముకుని డబుల్ బెడ్రూంలు, డూప్లెక్స్ భవనాలు కట్టుకున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు రెచ్చగొట్టేలా చూస్తారన్నారు. తన జోలికి వస్తే కార్యకర్తలు ఊరుకోరని వినయ్భాస్కర్ హెచ్చరించారు. అంబేద్కర్ ఆశయాలు, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని, సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు. ప్రజలు ఆయనను ఆశీర్వదించి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తారన్నారు. సీఎం కేసీఆర్ నన్ను ఐదోసారి ఆశీర్వదించి పంపించారన్నారు. 2005 ప్రారంభం దశలో పార్టీలో చేరిన సందర్భంలో 37వ డివిజన్ ప్రజలు కార్పొరేటర్గా గెలిపించినట్లు వినయ్భాస్కర్ గుర్తుచేశారు. ఆ తర్వాత అర్బన్ అధ్యక్షుడిగా, పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయలేదన్నారు. కార్యకర్తలను నమ్ముకున్న తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతిపాదిస్తే గెలిపించారన్నారు. నాటి నుంచి నేటి వరకు నాయకులు, కార్యకర్తలు నా వెంట నడిచారన్నారు. పార్టీపరంగా ఉద్యమకారులకు చేతనైనంత సహాయం చేసినట్లు చెప్పారు. ఇంకా దశలవారీగా వారిని ఆదుకుంటానన్నారు. సమైక్యాంధ్రలో అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఇక్కడి కవులు, కళాకారుల కోసం కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రోజు రెండు డివిజన్లలో..
రాబోయే రోజుల్లో దశలవారీగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకవుతానని, రోజు రెండు డివిజన్లలో పర్యటించనున్నట్లు చీఫ్ విప్ వినయ్భాస్కర్ చెప్పారు. సెప్టెంబర్ 1న భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో 29, 11 డివిజన్ల లో శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే, డివిజన్లలో కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇది ఎన్నికల పరీక్ష సమయమని అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు ‘నకలు’(చిట్టీలు) అందించి పాస్ చే యాలని ఈ సందర్భంగా నవ్వుతూ వినయ్భాస్కర్ అన్నారు. కార్యకర్తలే నా కుటుంబమని, వారికి ఎల్లవేళలా అండగా ఉంటూ కాపాడుకుంటానని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీని తరిమికొట్టాలి
మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ఎన్నికలు వేస్తేనే ప్రజల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను ఎక్కడికక్కడే నిలదీసి, తరిమి కొట్టాలన్నారు. 5వసారి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ వినయ్భాస్కర్ను ఆశీర్వదించి పంపించారన్నారు. ఆయన గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ వినయ్భాస్కర్ను ఐదోసారి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఓట్లు రావాలంటే కార్యకర్తలే పనిచేయాలన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు..
గ్రేటర్ 30, 40 డివిజన్ల నుంచి కాంగ్రెస్, బీజేపీకి చెందిన సుమారు వంద మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి చీఫ్ విప్ వినయ్భాస్కర్ కండువా కప్పి స్వాగతించారు. అలాగే, మొదటిసారిగా ఓటు హక్కు వచ్చిన సాయికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సమావేశంలో కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, వికలాంగుల సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, రైతు రుణ విమోచన సంస్థ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్, మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్సింగ్, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు ఉడుతల సారంగపాణి, జోరిక రమేశ్, నాయకులు నయీమొద్దీన్, దరిగి నిరంజన్, శీలం ప్రవీణ్ పాల్గొన్నారు.
వినయ్భాస్కర్కు గజమాలతో ఘనసన్మానం
హనుమకొండ చౌరస్తా : పశ్చిమ అభ్యర్థిగా దాస్యం వినయ్భాసర్ను ప్రకటించిన సందర్భంగా విష్ణుప్రియ గార్డెన్లో 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్కుమార్ ఆధ్వర్యంలో చీఫ్విప్ను గజమాలతో సన్మానించారు. కార్పొరేటర్ బొంగు అశోక్యాదవ్, బూత్ కన్వీనర్లు మేకల కిరణ్, అచుకట్ల రమేశ్, జ్యోతిబసునగర్ అధ్యక్షుడు బొట్ల కుమార్, హనుమకొండ బద్రి, ఇనుముల పద్మారావు, సందెల రాజు పాల్గొన్నారు.
ప్రజా సేవకుడు దాస్యం లా ప్రొఫెసర్ పద్మ
నిత్యం ప్రజా సమస్యల కోసం పరితపించే ప్రజాసేవకుడు ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అని లా ప్రొఫెసర్ పద్మ అన్నారు. హంటర్రోడ్లోని పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తనకు తెలుగులో మాట్లాడటం రాదన్నారు. కానీ, ఎంతో మందికి పాఠాలు చెప్పినట్లు తెలిపారు. లాయర్లు, జడ్జిలతో పాటు మాజీ మంత్రి దాస్యం ప్రణయ్భాస్కర్కు కూడా తన వద్ద పాఠాలు నేర్చుకున్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదోసారి దాస్యం వినయ్భాస్కర్ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ అతడిపై ఉంటాయన్నారు. అనంతరం ప్రొఫెసర్ పద్మ వద్ద దాస్యం వినయ్భాస్కర్ ఆశీర్వాదం తీసుకున్నారు.