ములుగు, ఆగస్టు24 (నమస్తే తెలంగాణ) : ‘ప్రజల కోసం నా తల్లిదండ్రులు పోరాట బాట పట్టారు. అరణ్యంలో ప్రకృతి తల్లి ఒడిలో నేను జన్మించాను. అమ్మానాన్నల ప్రేమ తెలియదు. నా బాల్యం దాదా(తాత) బడే జగన్నాథరావు, నానమ్మ రాంబాయితో గడిచింది. విద్యాభ్యా సం ప్రభుత్వ పాఠశాలలో సాగింది. అమ్మానాన్నలు నక్సల్ బాట పట్టి అమరులయ్యారు. వాళ్లు చాలా మంచివాళ్లని తెలిసిన వాళ్లు చెప్తుంటే విన్నా. నా తండ్రి గొప్పతనం, మం చి పనులు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయి. ఆయన అడవి బాట పడితే నేను ప్రజాస్వామ్య బాటను నిర్ణయించుకున్నా.’ అని జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. బీఆర్ఎస్ టికెట్ వచ్చిన సందర్భంగా ఆమె ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మా గ్రామ సమస్యలు పరిష్కరించాలనుకొని ఇండిపెండెంట్గా నిలబడి సర్పంచ్గా గెలిచాను. ఈ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నన్ను అక్కున చేర్చుకుంది. తాడ్వాయి జడ్పీటీసీగా బరిలో నిలిపి గెలిపించింది. అధిష్టానం జడ్పీ వైస్ చైర్పర్సన్గా అవకాశం కల్పించింది. దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్న హఠాన్మరణంతో జడ్పీ చైర్పర్సన్గా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది. ఇప్పుడు అతి చిన్న వయసులో ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో సీఎం కేసీఆర్ సార్ నిలిపారు. చిన్న తనంలో దాదా (తాత) నాకు చేయి అందిస్తే భవిష్యత్కు మార్గదర్శకంగా రాజకీయ ప్రస్థానానికి సీఎం కేసీఆర్ సారు గాడ్ఫాదర్గా నిలిచారు.’ అని వివరించారు.
తల్లిదండ్రుల ప్రేమ తెలియని తాను చిన్న నాటి నుంచి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. తల్లిదండ్రులు లేకపోడంతో తాత (దాదా) వద్ద పెరిగి 4వ తరగతి వరకు కాల్వపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నాను. అక్కడి నుంచి తాడ్వాయికి వచ్చి 5 నుంచి 8వ తరగతి వరకు చదివాను. 9, 10వ తరగతిని హనుమకొండలో పూర్తి చేశాను. ఇంటర్ ఏటూరునాగారంలో చదివాక డిగ్రీ, పీజీ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని పింగిలి కాలేజీలో పూర్తి చేశాను. ఉపాధ్యాయురాలిని కావాలనే కోరికతో బీఈడీ చదివి టెట్ పరీక్ష సైతం రాశాను. చిన్న నాటి నుంచి దాదా నానమ్మతో పాటు పెద్దమ్మ, చిన్నమ్మ, అత్తమ్మ సంరక్షణలో పెరిగాను. ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో సర్పంచ్తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి నాలుగేండ్లలో జడ్పీ చైర్పర్సన్ వరకు చేరుకున్నాను. సీఎం కేసీఆర్ తనను గుర్తించి ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎన్నికల బరిలో నిలబడిన నాకు ప్రజ లే బలగం, కేసీఆరే బలం, నియోజకవర్గ గులాబీ దళం నా కుటుంబంగా ముందుకు సాగుతున్నాను. పార్టీలోని ప్రతీ కార్యకర్తను ప్రత్యక్షంగా కలిసి నా గెలుపునకు కృషి చేయాలని కోరుతాను. జూనియర్ నుంచి సీనియర్ నాయకులందరినీ కలిసి వారి మద్దతును అడుగుతాను. గెలుపు కోసం ప్రణాళికతో ముందుకెళ్తూ అందరినీ సమన్వయం చేసుకొని ములుగు సీటును సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తాను.
ములుగు నియోజకవర్గ ప్రజలంతా నా వాళ్లే. అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ఓట్లు అభ్యర్థిస్తాను. జడ్పీటీసీగా అవకాశం కల్పించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలపడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత చిన్న వయస్సులో గొప్ప బాధ్యతను అప్పగించి వెన్నుదన్నుగా నిలుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గాడ్ ఫాదర్ కేసీఆర్ సార్ సూచనలు పాటిస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అం దిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతాను. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని గిరిజన ఆడబిడ్డగా అడిగిన వెంటనే సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్న పెద్ద బాధ్యతను అప్పగించారు. పార్టీకి కట్టుబడి ఉంటూ అధిష్ఠానం సూచనలను పాటిస్తూ అందరి సహకారంతో విజయఢంకా మోగిస్తాను. ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. నా నమ్మకం వమ్ము కాదు. ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం సైనికురాలిగా పనిచేస్తాను. ప్రజలకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ రాబోయే రోజుల్లో ములుగును మరింత అభివృద్ధి చేస్తాను. రాష్ట్రంలో వచ్చేది సీఎం కేసీఆర్ ప్రభుత్వమే. హ్యాట్రిక్ విజయం ఖాయం.