పోచమ్మమైదాన్, అక్టోబర్ 8: స్థలాలకు పట్టాలు అందించడమే కాదూ.. అర్హులందరికీ ఇండ్లు కట్టించే జిమ్మేదారి తనదేనని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 13వ డివిజన్ ఎంహెచ్నగర్లో రెండు దశాబ్దాల నుంచి పట్టాల కోసం ఎదురుచూస్తున్న గుడిసెవాసులకు ఆయన ఆదివారం పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువు నుంచి డప్పుచప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలు, డీజేతో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఆయనను గజమాలతో సత్కరించారు. 20 ఏళ్ల తర్వాత కల నెరవేరడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ నరేందర్నే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెగేసి చెప్పారు. అనంతరం కార్పొరేటర్ సురేశ్కుమార్ జోషి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ గరీబోళ్లకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. ఇరవై ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా గత పాలకులు పేదలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. నాడు పేదలు ఎంత గోస పడ్డారో, ఎంత కష్టపడ్డారో తనకు తెలుసునన్నారు.
అందుకే సీఎం కేసీఆర్ సహకారంతో ఇరవై ఏళ్ల కలను సాకారం చేశానన్నారు. మాట తీసిపోకుండా ఇంటి నంబర్, కరెంటు, సకల వసతులు కల్పించి అండగా ఉన్నానని గుర్తుచేశారు. గతంలో పాలించిన నాయకులు మన గోసను ఏనాడు పట్టించుకోలేదని, కనీసం అవసరాలు కూడా తీర్చకుండా అన్యాయం చేశారని తెలిపారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, డబుల్ బెడ్రూం, గృహలక్ష్మి.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే ఉపాధి అవకాశాల కోసం వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసుకున్నామని, రానున్న కాలంలో నియోజకవర్గంలో కంపెనీలను ఏర్పాటు చేసుకుని మన బిడ్డలకు ఉద్యోగాలు దొరికేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఎంహెచ్నగర్ చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద బండ్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
భావోద్వేగానికి గురైన మహిళ..
ఇళ్ల పట్టాల కోసం ఇన్నేండ్లు చెప్పులు అరిగెలా తిరిగి దెబ్బలు తిని, ధర్నాలు చేసి ఎంతో గోస పడ్డామని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి కాదు.. రెండు కాదూ.. ఇరవై ఏళ్ల నుంచి పడరాని కష్టాలు పడ్డాం.. పోలీసులతో దెబ్బలు తిన్నాం.. కేసులు భరించామంటూ వాపోయారు. ఈ సందర్భంగా ఓ మహిళ భావోద్వేగానికి గురై విలపిస్తుండగా ఎమ్మెల్యే నరేందర్ కన్నీళ్లు తుడిచి, నేనున్నాంటూ భరోసా కల్పించారు.
ఇకనుంచి మీకు చీకటి రోజులు రావని, అంతా తాను చూసుకుంటానంటూ ధైర్యం చెప్పారు. అనంతరం మహిళ మాట్లాడుతూ.. మేము పడ్డ కష్టాలకు దేవుడిలా నరేందరన్న వచ్చాడని, ఇక మాకు ఢోకా లేదన్నారు. అలాగే, మా మధ్య కార్పొరేటర్ సురేశ్ జోషన్న ఉంటూ అన్ని చూసుకుంటున్నాడని ఆనంద భాష్పాలు రాల్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్పొరేటర్ సురేష్కుమార్ జోషితో కలిసి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు, గృహలక్ష్మి ప్రొసీడింగ్స్, బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
గిరిప్రసాద్నగర్లో సంబురాలు
ఖిలావరంగల్: వరంగల్ 37వ డివిజన్ గిరిప్రసాద్నగర్లో గుడిసెవాసులు సంబురాలు జరుపుకున్నారు. జీవో నంబర్ 58, 59 ద్వారా గుడిసె స్థలాలకు శనివారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పట్టాలు పంపిణీ చేశారు. దీంతో ఆదివారం కాలనీవాసులు సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి డీజే సౌండ్కు స్టెప్పులు వేశారు. కాగా, ఎమ్మెల్యే నరేందర్ తన సొంత ఖర్చులతో గుడిసెవాసులకు మటన్తో భోజనం ఏర్పాటు చేసి, స్వయంగా వడ్డించారు. గిరిప్రసాద్నగర్ వాసులకు తమ ఇండ్ల స్థలాలకు హక్కుదారులు కావడంతో హర్షం వ్యక్తం చేశారు. తూర్పులో ఎమ్మెల్యే నరేందర్ను మళ్లీ భారీ మెజారిటీతో గెలిపించి గులాబీ జెండాను ఎగురవేస్తామని గిరిప్రసాద్నగర్ వాసులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, గిరిప్రసాద్నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఉల్ఫత్, బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు బోగి సురేశ్ పాల్గొన్నారు.