న్యూశాయంపేట, డిసెంబర్ 10 : ప్రాణం ఉన్నంత వరకూ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అరూరి మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన చైర్మన్లు, కన్వీనర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రజల పక్షాన నిలబడుతామన్నారు.
కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు. 2013 నుంచి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశానని, పార్టీ నాయకులు, కార్యకర్తలు త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకుడు నాగుర్ల వెంకన్న, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జిల్లా రైతుబంధు అధ్యక్షురాలు లలితాయాదవ్, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గజ్టెల శ్రీరాములు, కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ, సర్వర్, ఆత్మ చైర్మన్లు గుజ్జ గోపాల్రావు, కందుకూరి చంద్రమోహన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, పార్టీ మండల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.