టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన ‘చీప్’ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి హాథ్ సే హాథ్ జోడో యాత్రలో ఆయన మాట్లాడిన మాటలు గులాబీ నేతలు, రాజకీయ ప్రముఖుల్లో ఆగ్రహం తెప్పించాయి. సీఎం అధికారిక నివాసమైన ప్రగతిభవన్ను నక్సలైట్లు పేల్చివేయాలని రేవంత్ పిలుపునివ్వడం ఆయన అవివేకానికి నిదర్శనమని పలువురు నేతలు విమర్శించారు.
ఎవరు సీఎం అయినా అందులోనే ఉంటారని, అది ప్రభుత్వ భవనమని కూడా రేవంత్కు తెలియదా అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు అవివేకపు వ్యాఖ్యలు చేసి ‘రవ్వంత’ పేరును ఆయన సార్థకం చేసుకున్నారని ఎద్దేవాచేశారు. రేవంత్ తీరును నిరసిస్తూ వరంగల్, ములుగు జిల్లాల్లో బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ దిష్టిబొమ్మలతో శవయాత్రలు తీసి కూడళ్లు, రోడ్లపై దహనం చేసి నిప్పులు చెరిగారు.
వరంగల్, ఫిబ్రవరి 8 (నమస్తేతెలంగాణ) : ప్రగతి భవన్ను నక్సలైట్లు పేల్చివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరంగల్, ములుగు జిల్లాల్లో బుధవారం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలతో శవయాత్రలు తీసి, కూడళ్లు, రోడ్లపై దహనం చేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపుమేరకు నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ మండల కేంద్రాల్లో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలతో శవయాత్రలు జరిపారు.
రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పరిపాలన భవనం, తెలంగాణ ప్రగతికి చిహ్నమైన ప్రగతిభవన్ను నక్సలైట్లు పేల్చివేయాలని పేర్కొనడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి ఆయనను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డిని ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలనిన్నారు. రేవంత్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, లేదంటే ప్రజలు, ఉద్యమకారులు గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ మండల, గ్రామ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రేవంత్రెడ్డి, సీతక్కపై ఫిర్యాదు
‘ప్రగతిభవన్ పేల్చివేత కుట్ర’పై విచారణ చేయాలని డిమాండ్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క)పై మంగళవారం అర్ధరాత్రి ములుగు పోలీస్స్టేషన్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ములుగు రోడ్షోలో రేవంత్రెడ్డి సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్ను పేల్చివేయాలని నక్సలైట్లకు పిలుపునిచ్చారని, నిషేధిత నక్సలైట్లకు పిలుపునివ్వడంలో రేవంత్ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రాణానికి హాని కలిగించేందుకే నక్సలైట్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, దీనిపై విచారణ జరిపించాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు. రేవంత్రెడ్డికి, నక్సలైట్లకు ఎమ్మెల్యే సీతక్క మధ్యవర్తిత్వం వహించినట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. రేవంత్రెడ్డి, సీతక్కపై కుట్ర కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎంపీటీసీల ఫోరం ములుగు జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్రామ్నాయక్, మండల కోఆప్షన్ సభ్యులు యూనుస్, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు కోగిల మహేశ్ ఉన్నారు.