నిరుద్యోగ మార్చ్ పేరిట వరంగల్లో శనివారం సాయంత్రం బీజేపీ చేపట్టిన కార్యక్రమానికి యువత నుంచి స్పందన కరువైంది. కమలం కార్యకర్తలే పార్టీ కండువాలు, జెండాలతో మార్చ్లో పాల్గొనడం కనిపించింది. నిరుద్యోగులెవరూ రాకపోవడంతో మార్చ్ను ఆలస్యంగా మొదలుపెట్టిన పార్టీ నాయకులు, ఎప్పటిలానే రెచ్చగొట్టే ప్రసంగాలతో మమ అనిపించారు. ర్యాలీలో అడుగడుగునా బీజేపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు దిగారు. కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇచ్చినా కమిషనరేట్లోకి దూసుకెళ్లి రచ్చచేసేందుకు విశ్వప్రయత్నం చేశారు.
వరంగల్, ఏప్రిల్15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే బీజేపీ, వరంగల్లో శనివారం నిర్వహించిన నిరుద్యోగ మార్చ్లోనూ అదే ప్రయత్నాలు చేసింది. ఎప్పుడూ పోలీసులు అనుమతి ఇవ్వలేదనే సాకుతో లొల్లి మొదలు పెట్టే బీజేపీకి, ఈసారి ర్యాలీ కోసం పోలీసులు అనుమతి ఇచ్చారు. ఎలాగైనా ర్యాలీని పెద్దదిగా చేసి చూపాలనే ప్రయత్నంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పాత ప్రణాళికలే అమలు చేసింది. కాకతీయ యూనివర్సిటీ రెండో గేటు నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.
పేరుకు నిరుద్యోగ మార్చ్ అని ప్రకటించినా అందరూ బీజేపీ కార్యకర్తలే కనిపించారు. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. నిరుద్యోగులు అసలే రాకపోగా, సొంత పార్టీ వారు ర్యాలీ వైపు రావడం ఆలస్యం కావడంతో ప్రకటించిన సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా మార్చ్ మొదలైంది. చివరికి బీజేపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలతోనే ర్యాలీ తీశారు. ర్యాలీ మొదలు కావడానికి చాలా ముందు నుంచే ఎలాగైనా గొడవలకు దిగాలని బీజేపీ నేతలు ప్రయత్నించారు. అనుమతి ఇచ్చిన సమయం కంటే ఆరు గంటలు ముందుగానే యూనివర్సిటీ వద్దకు పలువురు బీజేపీ రాష్ట్ర నేతలు వచ్చారు. అక్కడి పోలీసులు, విద్యార్థులతో ఘర్షణకు దిగేందుకు ప్రయత్నించారు.
అనుకున్న లక్ష్యం నెరవేకపోవడంతో సాయంత్రం వరకు ఇలాంటి ప్రయత్నాలే చేశారు. చివరికి యువకులు లేకుండా ర్యాలీ మొదలు కాగా, యూనివర్సిటీ జంక్షన్ నుంచి నయీంనగర్ జంక్షన్ వద్దకు రాగానే కొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ కమిషనరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులతో గొడవకు దిగారు. పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో చేసేది లేక ముందుకువెళ్లారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంబేద్కర్ జంక్షన్లో ఎప్పటిలానే ఆవేశంతో ఊగిపోతూ రెచ్చగొట్టే ప్రసంగంతో ముగించారు.