కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న తెలంగాణ సర్కారు ఉపాధ్యాయులు, ఉద్యోగుల పనితీరును మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. నాణ్యమైన బోధన అందించడంతోపాటు విధి నిర్వహణ సక్రమంగా ఉండేలా బయోమెట్రిక్ విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జిల్లాలోని 12 మండలాల్లో కస్తూర్బాగాంధీ విద్యాలయాలు ఉండగా వీటిలో 2,564 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. టీచింగ్ స్టాఫ్ 137 మంది ఉండగా, నాన్ టీచింగ్లో119 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల వరకే ఉద్యోగులు పాఠశాలలకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడడంతో బోధన, బోధనేతర సిబ్బంది దీనిని అమలు చేస్తున్నారు. దీంతో విద్యాబోధన సజావుగా సాగుతుండడంతో ఫలితాలు సైతం మెరుగవుతున్నాయి.
బచ్చన్నపేట, నవంబర్ 14 : ఇప్పటికే ప్రభుత్వ పథకాలన్నీ పారదర్శకంగా అమలు చేస్తున్న తెలంగాణ సర్కారు విద్యకు మరింత ప్రాధాన్యం ఇస్తుంది. నాణ్యమైన బోధనతో పాటు సమయపాలన పాటించాలన్న లక్ష్యంతో బడుల్లో బయోమెట్రిక్ అమలు చేస్తున్న ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో సైతం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో బోధన, బోధనేతర సిబ్బంది ఇక కచ్చితంగా సమయానికి బడికి రావాల్సిందే. నిముషం అలస్యమైనా రెడ్ మార్క్ చూపించి ఆప్సెంట్ పడ్డట్టే. జనగామ జిల్లాలోని 12 మండలాల్లోని పాఠశాలల్లో 2,564 మంది బాలికలు చదువుకుంటున్నారు. ఆయా విద్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం అమలు అవుతుండడంతో సమయానికి ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచే బయోమెట్రిక్ విధానం అమలు అయ్యేలా జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశాలు ఇచ్చి పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు.
జనగామ జిల్లాలో 12 కేజీబీవీలు..
జిల్లాలోని 12 మండలాల్లో 12కేజీబీవీలు ఉండగా అందులో 2,564 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. వారికి పారదర్శకంగా బోధన చేపట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఆయా విద్యాలయాల్లో పని చేస్తున్న బోధనా సిబ్బంది 137, నాన్ టీచింగ్ స్టాఫ్ 119 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేకాధికారులు, సీఆర్టీలు, ఏఎన్ఎంలు, పీజీ సీఆర్టీలు, పీఈటీలు విద్యాలయానికి సకాలంలో వచ్చేలా బయోమెట్రిక్ను అమలు చేస్తున్నారు. దీంతో ఉదయం 9 గంటలలోపు ఉపాధ్యాయులు, 9-45 లోపు విద్యార్థులు హాజరయ్యేలా నిబంధనలున్నాయి. ప్రార్థన సమయానికి ఎంత మంది వచ్చారో..తిరిగి సాయంత్రం బడి ముగిశాక ఏ సమయానికి వెళ్తున్నారో అంతా అందులో నమోదు అవుతుంది. ఈ విధానంతో ఉపాధ్యాయుల గైర్హాజరుకు, ఇష్టారాజ్యంగా వచ్చే వారికి బ్రేక్ పడింది. పాఠశాలకు ఒక్క నిముషం అలస్యమైనా సరే రెడ్మార్క్ చూపించి గైర్హాజరే పడుతుంది.
పారదర్శకత కోసమే బయోమెట్రిక్..
ప్రభుత్వం విద్యాశాఖను మరింత బలోపేతం చేయడంలో భాగంగా బయోమెట్రిక్ విధానానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలలకు ఉపాధ్యాయులు కచ్చితంగా ఉదయం 9 గంటల సమయానికి రావాలన్న నిబంధనల మేరకు ఈ విధానం అమలు చేస్తున్నారు. సమయానికి వస్తే హాజరు నమోదు.. లేకుంటే రెడ్మార్క్తో గైర్హాజరు అని పడుతుండడంతో ఉపాధ్యాయులు సైతం ఇక సమయానికే వస్తున్నారు. జిల్లా సెక్టోరియల్ అధికారులకు ఈ పర్యవేక్షణ అధికారం కల్పించారు. ప్రార్థ్ధన సమయానికి ఎంత మంది వచ్చారు. అలస్యంగా ఎంత మంది వచ్చారో ఇట్టే తెలుసుకునే అవకాశం ఈ విధానంలో పొందుపర్చారు. సకాలంలో హాజరయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి.
డివైజ్లు అందించాం..
జిల్లాలోని 12 కేజీబీవీల్లో ఉపాధ్యాయులు సకాలంలో హాజరు కావాలన్న లక్ష్యంతో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి జిల్లాలోని అన్ని విద్యాలయాలకు డివైజ్లు అందించాం. దీంతో విద్యాలయాల్లో ఉపాధ్యాయులు సమయపాలన కచ్చితంగా పాటిస్తున్నారు. గతంలో అయితే వాట్సాప్, ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకునేది. ఇప్పుడా ఆ పరిస్థితి మారిపోయింది. ఎవరు పాఠశాలకు ఎప్పుడు వస్తున్నారో బయోమెట్రిక్తో ఇట్టే తెలిసిపోతుంది. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచే పర్యవేక్షించే అవకాశం కలిగింది. ఈ విధానంతో విద్యా వ్యవస్థ మరింత బలపడే అవకాశాలు న్నాయి. సకాలంలో ఉపాధ్యాయులు బడికి రావాల్సిందే. అంతే కాకుండా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని, ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో పొందు పర్చాల్సి ఉంటుంది.
– గౌసియా బేగం, సెక్టోరియల్ అధికారి, జనగామ జిల్లా
పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాం..
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగామ జిల్లాలోని అన్ని కసూర్బా పాఠశాలల్లో పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాం. బయోమెట్రిక్ విధానం కచ్చితంగా పాటించాల్సిందే. జిల్లా వ్యాప్తంగా 12 విద్యాలయాలున్నాయి. అన్నింటిలో సక్రమంగా ఈ విధానం అమలు అవుతుంది. ప్రత్యేకాధికారులతో పాటు ఉపాధ్యాయుల హాజరు సహ విద్యార్థుల హాజరు శాతం ఎప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్షకు అందజేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఈ విధానంతో సమయపాలన పాటిస్తున్నారు. జిల్లాలోని అన్ని విద్యాలయాలను పర్యవేక్షిస్తున్నం.
– రాము, జిల్లా విద్యాశాఖాధికారి, జనగామ