భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 13: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపొతే వారిపై ఉన్న కేసులు ఎత్తేస్తాం. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ఉపాధి కల్పిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్రెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని సుభాష్కాలనీలో ఉన్న సింగరేణి కమ్యూనిటీ హాలులో మావోయిస్టుల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం పోలీస్శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ సురేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అండర్గ్రౌడ్లో ఉన్న జిల్లాకు చెందిన ఏడుగురు మావోయిస్టుల కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మావోయిస్టు కుటుంబాలకు ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరించేందుకు జిల్లా పోలీస్శాఖ సిద్ధంగా ఉందన్నారు. తమ కుటుంబ సభ్యుల కోసమైనా అడవిబాట వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. కాలం చెల్లిన సిద్ధ్దాంతాలతో సాధించేదేమీ లేదని, లొంగిపోయిన వారికి ప్రభుత్వ పరంగా సహకారం ఉంటుందన్నారు. మావోయిస్టుల కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారికి ఎస్పీ మందులు, దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఓఎస్డీ గౌస్ ఆలం, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు ఏ రాములు, జీ రామ్మోహన్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీసిద్ధు, డాక్టర్ కిరణ్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.