హనుమకొండ, జూలై 11: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ‘కేటీఆర్ నిరుద్యోగ భరోసా.. ఉచిత ఆన్లైన్ కోచింగ్’ ఇస్తున్నట్లు రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను శనివారం హనుమకొండలో కేయూ విద్యార్థి ఉద్యమ కారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ బర్త్ డే సందర్భంగా నిరుద్యోగులకు అందిస్తున్న సువర్ణావకాశం అన్నారు.
విన్నర్స్ ఆన్ లైన్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో ఈ నెల 22న హనుమకొండ సుబేదారిలోని న్యూ రాయల్ గార్డెన్స్లో గ్రూప్స్ 2,3, ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉచిత ఆన్లైన్ కోచింగ్ కోసం ఇస్తున్నామని, పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు. నాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ బర్త్డే సంద ర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద ప్రభుత్వ దవాఖానలకు అంబులెన్సులు, దివ్యాంగులకు త్రీ వీలర్స్ మోటర్ బైకులు, ఎంతోమంది పేద విద్యార్థులకు చదువు కోసం ఆర్థిక సహాయం అందించి పేదల కళ్లలో ఆనందం చూసేవారమన్నారు. అలాగే ఇప్పుడు నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.
వేలాది మందిని ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1 అధికారులుగా తీర్చిదిద్దిన ట్రైనర్, నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్రతో ప్రధాన ప్రసంగం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కేయూ విద్యార్థి ఉద్యమకారులు జోరిక రమేశ్, డాక్టర్ బీ వీరేందర్, డాక్టర్ పీ కొమురయ్య,డాక్టర్ యాకూబ్ రెడ్డి, ఎం శరత్ చంద్ర, దామోదర్, డాక్టర్ రజనీకుమార్, రవి నాయక్, బీ ప్రశాంత్, జెట్టి రాజేందర్, ధర్మారపు వేణు, ప్రభాకర్, మనోజ్, వీరు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.