చారిత్రక నగరికి మణిహారం.. హాలిడే స్పాట్గా బయోడైవర్సిటీ పార్కు
నగరవాసులకు ఆనందం, ఆహ్లాదం
ఆటాపాటలతో చిన్నాపెద్ద రిలీఫ్.. వారాంతాల్లో సందర్శకుల తాకిడి
కాకతీయ కళా నైపుణ్యానికి ప్రతిరూపాలుగా తోరణాలు
రూ.30కోట్ల నిధులతో అభివృద్ధి
న్యూశాయంపేట, మే 28: కాకతీయుల కళా నైపుణ్యం ఉట్టిపడేలా చెక్కిన రాతిశిల్పాలు.. తోరణాలు, నడిచేందుకు వీలుగా సింథటిక్ ట్రాక్.. రారామ్మని ఆహ్వానించే రకరకాల పూల మొక్కలు, ఆకట్టుకునే పొడవాటి షో చెట్లు.. రాత్రివేళ తీరొక్క రంగుల్ని విరజిమ్మే నాలుగు ఫౌంటేన్లు.. ఇలా అత్యాధునిక హంగులతో సరికొత్తగా రూపుదిద్దుకున్న భద్రకాళి బండ్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చారిత్రక నగరికి మణిహారంగా నిలిచిన బయోడైవర్సిటీ పార్కును కుడా రూ.30కోట్లతో తీర్చిదిద్దగా నగరవాసులకు వీకెండ్ హాలీడే స్పాట్గా మారింది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సగటు నగరవాసికి ఆహ్లాదం, ఆనందం పంచుతోంది. లొకేషన్ అద్భుతంగా ఉండడంతో ఫొటోషూట్స్ తీసేందుకు యూత్ ఇష్టపడుతున్నారు. స్థానికులే గాక ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు.
భద్రకాళి ఆలయానికి ఆనుకొని ఉన్న భద్రకాళి బండ్ ఆహ్లాదానికి కేరాఫ్గా మారింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూ.30కోట్లతో అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్కు(భద్రకాళి బండ్) నగరానికి మణిహారంగా నిలుస్తోంది. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్కు ప్రతిరోజు వస్తున్న పర్యాటకులతో పాటు నగర ప్రజలతో కిక్కిరిసిపోతున్నది. వారాంతపు సెలవులు, పండుగ సమయాల్లో సందర్శకులతో సందడిగా మారుతోంది.
ఫొటోషూట్లతో సందడి
మారిన ట్రెండ్కు భద్రకాళి అడ్డాగా మారింది. ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా ఫొటోషూట్లు, ప్రీ వీడియో షూట్లు చేస్తున్న తరుణంలో అందమైన లొకేషన్తో ఉన్న భద్రకాళి బండ్పై షూట్ చేసేందుకు నగరవాసులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఒకవైపు బండ్పై అందమైన గ్రీనరీ, మరోవైపు భద్రకాళి కొండలు, ఆలయం, మధ్యన చెరువుతో లోకేషన్ అద్భుతంగా కనిపిస్తోంది. సాయంసంధ్యలలో ఇక్కడి అందాలు వీక్షించేందుకు రెండు కళ్లు చాలడం లేదని మచ్చాపూర్ నుంచి స్నేహితులతో కలిసి వచ్చిన మమత తన అభిప్రాయాన్ని పంచుకుంది.
సందర్శకుల తాకిడి
రోజురోజుకూ సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ప్రతిరోజు 1500నుంచి 2వేల మంది వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సెలవు రోజుల్లో సందర్శకుల తాకిడి రెట్టింపు ఉంటోందని తెలిపారు. ఎంట్రీ టికెట్ పిల్లలకు రూ.20, పెద్దలకు రూ.30గా నిర్ణయించారు. వేసవి సెలవులు కావడంతో బండ్కు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఆహ్లాదంతోపాటు వినోదం ఆస్వాదించేలా వీకెండ్ రోజుల్లో ఈవెంట్లు పెడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఆకట్టుకుంటున్న తోరణాలు
కాకతీయ కళానైపుణ్యం ఉట్టిపడేలా రాతిపై చెక్కిన శిల్ప సంపద సందర్శకులను ఆకట్టుకుంటున్నది. బండ్పై ఏర్పాటు చేసిన నాలుగు ఫౌంటేన్లు, రాత్రివేళ్లలో రంగురంగులతో నీళ్లను విరజిమ్ముతుండడం పిల్లలతో పాటు పెద్దలను ఆకట్టుకుంటున్నాయి. అలాగే కిలోమీటర్ మేర అభివృద్ధి చేసిన బండ్ పొడువునా గార్డెనింగ్, పూలచెట్లు, ఈత చెట్లు ఆహ్లాదం పంచుతున్నాయి. మధ్యమధ్యలో ఉన్న ఓపెన్ జిమ్లు పిల్లలను బండ్ను వదిలి రాకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బండ్పై కిలోమీటర్ పొడవునా ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనిపై నడుస్తుంటే దూదిపై నడిచిన అనుభూతి కలుగుతోందని సందర్శకులు సంతోషంగా చెబుతున్నారు.
సూపర్గా ఉంది..
మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. భద్రకాళి బండ్ చాలా బాగుందని మా మిత్రులు చెప్పారు. చూద్దామని వచ్చాం. నిజంగా అద్భుతంగా ఉంది. ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాం. పిల్లలు, పెద్దలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడి లొకేషన్లు సూపర్గా ఉన్నాయి.
– సుష్మ-భానుప్రకాశ్
రోజుకు 3వేల మంది వస్తున్నరు
భద్రకాళి బండ్ను తిలకించేందుకు చాలామంది వస్తున్నారు. వరంగల్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి శని, ఆదివారాలే కాకుండా మిగతా రోజుల్లో సందడిగా ఉంటోంది. రోజుకు మూడు వేల మంది దాకా వస్తున్నారు. కుడా ఆధ్వర్యంలో నిర్మించిన బండ్ బాగుందని పర్యాటకులు చెబుతున్నారు.
– జే యాదగిరి, కుడా ఏడీఎం