పచ్చని తివాచీ పరిచినట్టున్న దారులు.. ఆహ్లాదం పంచే తీరొక్క పూలు, అలంకరణ మొక్కలు.. అడవిని తిరుగాడుతున్నట్టు కనిపించే రంగురంగుల పక్షులు, జంతువుల గోడచిత్రాలు.. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఏర్పాటుచేసిన ఆట వస్తువులతో ఈ పట్టణ ప్రకృతి వనం నగరవాసులకు ఆనందం.. ఆహ్లాదం పంచుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా వరంగల్ గుండుబావిలోని ఈ పార్కు ప్రజలకు సరికొత్త అనుభూతినిస్తోంది. ఒకప్పడు జనావాసాల మధ్య చెత్తాచెదారం నిండి ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడిలా ‘ప్రకృతి’ వనంగా మారి అందరినీ ఆకట్టుకుంటున్నది.
– కరీమాబాద్, అక్టోబర్ 25
వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతం కరీమాబాద్లోని గుండుబావి సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఈ పట్టణ ప్రకృతి వనం రూపుదిద్దుకున్నది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరవతో దీనిని తీర్చిదిద్దారు. పరిసర ప్రాంత ప్రజలు, పిల్లలకు ఆనందాన్ని కలిగించేలా ఏర్పాట్లు చేశారు. పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించి వాటికి చక్కని రంగులు వేశారు. గతంలో చెత్తాచెదారంతో ఉన్న పార్కు.. ఇప్పుడు అందమైన బొమ్మలతో కనువిందు చేస్తోంది.
ఆనందం.. ఆహ్లాదం..
ప్రజలకు ఆనందంతో పాటు ఆహ్లాదం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం పార్కును ఏర్పాటుచేసింది. జనావాసాల మధ్య ఉన్న వరంగల్ మహానగరపాలక సంస్థకు చెందిన ఈ స్థలం ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నది. పార్కు స్థలంలో పెద్దల కోసం వాకింగ్ ట్రాక్ నిర్మించారు. చిన్న పిల్లలు ఆటలు ఆడుకునేందుకు వీలుగా పలు రకాల వస్తువులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు గాను పచ్చని గ్రీనరీ సైతం ఏర్పాటు చేశారు. అలాగే సేద తీరేందుకు బెంచీలు వేయించారు. పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించి పచ్చని మొక్కలు నాటారు. చుట్టూ గోడలకు గ్రిల్స్ను అమర్చారు. హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. పార్కులో ఏర్పాటుచేసిన వాటర్ ఫౌంటేన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిత్యం పని ఒత్తిడితో అలసిపోయిన నగరవాసులకు ఈ పచ్చని పార్కు హాయిని పంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.