వరంగల్, జూన్ 26 : వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కాలనీలపై ఇంజినీర్లు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ముంపు కాలనీల జాబితాలను రూపొందించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో సమయానుకూలంగా అధికారులు స్పందించాలన్నారు. వరద ముంపు ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేసుకొని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని బృందాలు ముందస్తుగా సన్నద్ధంతో ఉండాలన్నారు. ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
అర్బన్ షెల్టర్ హోమ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమమైతే ప్రధాన కార్యాలయానికి తరలించాలని, తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. ఓపెన్ ప్లాట్ల యాజమానుల వివరాలను అందించాలని ఆదేశించారు. వారికి ఈ నెల 30లోగా నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నగరంలో గుర్తించిన 291 శిథిలావస్థలో ఉన్న భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. భవనాల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
నాలాల పూడికతీత పక్రియ వేగవంతం చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు డీసీపీ, ఏసీపీ, ఈఈలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. మ్యాన్హోల్ క్లీనింగ్ తర్వాత మార్కింగ్ చేయాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో అధికారులకు సెలవులు ఉండవని కమిషనర్ తెలిపారు. సమావేశంలో అదనపు కమిషనర్ రవీందర్ యాదవ్, ఇన్చార్జి అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్ చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, బయాలజిస్ట్ మాధవరెడ్డి, డీఎఫ్వో శంకరలింగం, డిప్యూటీ కమిషనర్ జోనా, ఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.