తూర్పు కమలంలో కల్లోలం మొదలైంది. నియోజకవర్గంలో బీజేపీలో కొత్తగా చేరిన నాయకుల ఆధిపత్యం పెరిగిపోవడంతో బీసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తి చెందుతున్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు దక్కడం లేదని ఒక్కొ క్కరుగా పార్టీని వీడుతున్నారు. కొద్ది నెలలుగా సీనియర్ నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారు. త్వరలోనే మరికొందరు బీసీ, ఎస్సీ నేతలు కమలం పార్టీని వీడి కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.
– వరంగల్, జనవరి 6
వరంగల్, జనవరి 6: బీజేపీలో బీసీ నేతలు ఇమడలేకపోతున్నారు. పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడాన్ని సహించలేక పోతున్నారు. బీజేపీలో చేరిన అగ్రవర్ణాలకు చెందిన నాయకుల పెత్తనాన్ని బీసీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొత్తగా చేరిన నాయకుల ఆధిపత్యం పెరిగిపో వడంతో సీనియర్ నేతలు తిరుగుబాటు చేస్తున్నా రు. సిద్ధాంతాలు తెలియని నాయకులు ఇప్పుడు పార్టీలో చేరి పగ్గాలు పట్టుకోవడంతో సీనియర్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. కొద్ది నెలల్లోనే తూర్పు నియోజ కవర్గంలోని సీనియర్ నాయకులు కమలం పార్టీ నుంచి కారెక్కారు. త్వరలోనే మరికొంత మంది బీసీ, ఎస్సీ నేతలు పార్టీ వీడనున్నట్లు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ నాయకులకు బీజేపీలో ప్రాధాన్యం లేకుండా పోతోందని బాహాటంగానే చెప్పు కుంటున్నారు.
ఒక్కొక్కరుగా కారెక్కుతున్న బీసీ నేతలు
తూర్పు నియోజవర్గం బీజేపీ బీసీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. కమలం గూటిని వదిలి కారెక్కుతున్నారు. వరంగల్ నగర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన చింతాకుల సునీల్, 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ పార్టీలో యువ నాయకులుగా గుర్తింపు పొందారు. యూత్లో అనిల్కుమార్కు మంచి ఫాలోయింగ్, గుర్తింపు ఉంది. పార్టీ కోసం శ్రమి స్తున్నా ప్రాధాన్యం దక్కడం లేదని చింతాకుల సునీల్, అనిల్కుమార్ బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. మరో కీలక బీసీ నాయ కుడు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కూచన క్రాంతికుమార్ రెండు రోజుల క్రితం కమలం పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. మరికొంత మంది నేతలు అదే బాటలో నడిచేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అన్యాయం జరుగు తుందన్న కారణంగానే బీసీ నేతలు ఒక్కొక్కరు బీజేపీని వీడుతున్నారు.
తూర్పు బీజేపీలో తిరుగుబాటు..
వరంగత్ తూర్పు బీజేపీలో తిరుగుబాటు మొదలైంది. బీసీ, ఎస్సీ వర్గాల నాయకులు ఒక్కొక్కరు పార్టీని వదిలివెళ్తున్నారు. నాలుగు నెలల్లో సీనియర్లు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఇటీవల వచ్చిన నాయకుల పెత్తనం పెరిగిపోవవడంతో దశాబ్దాల కాలంగా పార్టీ కోసం పని చేసిన నాయకులు జీర్ణించుకోలేక పోతున్నా రు. నలుగురు కార్యకర్తలు లేని సమయంలో పార్టీ జెండా పట్టుకుని పని చేసిన వారు రగిలిపో తున్నారు. పాతతరం నాయకులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇప్పుడే పార్టీలోకి వచ్చిన వారిని అందలం ఎక్కించడంపై సీనియర్ నాయకులు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు.
బీసీ నాయకత్వానికి జై..
అగ్రవర్ణాల పెత్తనాన్ని సహించలేక తూర్పు బీజేపీలోని బీసీ నేతలు పార్టీని వీడుతున్నారు. 90 శాతం వెనుకబడిన వర్గాల ఓటర్లు ఉన్న తూర్పు నియోజకవర్గంలో బీజేపీ అగ్రవర్ణాలను ఆందలం ఎక్కించడాన్ని బీసీ నేతలకు మింగుడుపడడం లేదు. దీంతో బీసీ నాయకులు బీసీ నాయకత్వం వైపు మొగ్గుచూపుతున్నారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో బీసీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో నియోజకవర్గంలో బీజేపీ కుదేలు అవుతోంది.