హనుమకొండ, సెప్టెంబర్ 22 : బతుకమ్మ పండుగ అంటేనే వరంగల్ జిల్లా అని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వరంగల్లోనే బతుకమ్మ, దసరా పండుగలను ఘనంగా జరుపుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో వరంగల్ జిల్లా, గ్రేటర్ వరంగల్ పరిధిలో బతుకమ్మ, దసరా ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రి సత్యవతిరాథోడ్, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపితో కలిసి సమీక్షించారు. ముందుగా మంత్రి ఎర్రబెల్లి ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు చేపట్టిన ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ప్రతి పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పండుగలను ఏనాడూ ఎవరు గుర్తించలేదని పేర్కొన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వం తరఫున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. యావత్తు తెలంగాణలో ఒక వరంగల్లోనే బతుకుమ్మ పండుగను ఎంతో ఘనంగా ఆడబిడ్డలు జరుపుకుంటారని చెప్పారు. అందుకే సీఎం కేసీఆర్ ఒక అన్నగా ప్రతి పేద ఆడబిడ్డకు బతుకమ్మ పండుగ చీర అందిస్తున్నారని అన్నారు. కానీ, కొన్ని చోట్ల కొందరు నీచ రాజకీయాలకుపాల్పడుతూ ఆ చీరలను తగుల బెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలోనే చీరలను నేయిస్తున్నామని, దీంతో మన రాష్ట్రంలోని వారికే ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతున్నాయన్నారు. చీరులు అవసరం లేకుంటే తీసుకోవద్దని, చీరలను తగులబెట్టే చేష్టలకు దిగజారే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సీపీని ఆదేశించారు. చెరువుల్లోని గుర్రపు డెక్కలను తొలిగించాలన్నారు. సద్దుల బతుకమ్మ జరిగే ప్రతిచోట ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, దసరా వేడుకలు జరిగే రంగలీల మైదానంలో కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలసి సూచించారు. గతంలో పొరపాట్లు జరిగాయని ఈ సారి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ, దసరా పండుగలు అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అనుభవం ఉన్న అధికారులను నోడల్ అధికారులుగా నియమించి, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు కలిసి సమన్వయంతో పనిచేసి పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించుకోవాలని ఆమె సూచించారు. బతుకమ్మ నిర్వహించే ప్రాంతాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాపాడాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం చీరలను కాల్చుతూ దుష్ప్రచారం చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలని సూచించారు. సమావేశంలో నగర మేయర్ గుండు సుధారాణి, సీపీ తరుణ్ జోషి, వరంగల్ కలెక్టర్ గోపి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, వేయిస్తంభాల ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వివిధ శాఖల అధికారులు, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.