వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవలను పట్టణాల్లోని మురికివాడలకు విస్తరిస్తున్నది. ఇప్పటికే గ్రామాల్లోని హెల్త్ సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం, తాజాగా ఏరియాల్లో బస్తీ దవాఖానల ఏర్పాటుకు ఆదేశించింది. ఈమేరకు జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కాలనీ, గిరిప్రసాద్నగర్, బీఆర్ నగర్, నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ భవనాల్లో ముస్తాబు చేస్తున్నారు. ఒక్కో దవాఖానకు రూ.13లక్షలు కేటాయించగా అభివృద్ధి పనులు పూర్తి చేశారు.
వరంగల్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మారుమూల గ్రామాలు, పట్టణాల్లో మురికివాడల ప్రజలకు సైతం సర్కారు వైద్యాన్ని తెస్తున్నది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ సబ్ సెంటర్లన్నింటిని పల్లె దవాఖాన (వెల్నెస్ సెంటర్)లుగా మార్చుతున్నది. జిల్లాలో ఇప్పటికే 82 సబ్సెంటర్లను వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వీటిలో 46చోట్ల సెంటర్కో వైద్యుడిని నియమించింది. వీరితోపాటు ఇన్నాళ్లు విధులు నిర్వర్తిస్తున్న ఏఎన్ఎం, ఆశాలు అక్కడ సేవలు అందిస్తున్నారు. మిగతా 36 వెల్నెస్ సెంటర్లలోనూ వైద్యులను నియమించనున్నారు.
ఇక పట్టణాల్లోని స్లమ్స్ (మురికివాడలు)లో బస్తీ దవాఖానలు ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పట్టణాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్లమ్స్లో వీటి ఏర్పాటుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు బస్తీ దవాఖానల స్థాపన కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో అధికారులు సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు బస్తీ దవాఖానలను రెడీ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే మూడు బస్తీ దవాఖానలను ప్రారంభానికి ముస్తాబు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం నాలుగు బస్తీ దవాఖానలను మంజూరు చేసింది. వీటిలో మూడింటిని జిల్లా కేంద్రమైన వరంగల్లో, ఒకటి నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొల్పేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ భవనాల్లో ఈ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని, వీటి నిర్వహణ కోసం అవసరమైతే సదరు ప్రభుత్వ భవనాలను అనువుగా తీర్చిదిద్దాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. బస్తీ దవాఖాల ఏర్పాటు కోసం ప్రభుత్వ భవనాలను గుర్తించడం, వాటిని బస్తీ దవాఖానల నిర్వహణకు అనుకూలంగా తయారు చేసే బాధ్యతలను మున్సిపల్ శాఖ అధికారులకు అప్పగించింది.
ఒక్కోదానికి రూ.13లక్షలు
వరంగల్లో క్రిస్టియన్కాలని, గిరిప్రసాద్నగర్, బీఆర్ నగర్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఈమేరకు క్రిస్టియన్కాలనీ, గిరిప్రసాద్నగర్లో మున్సిపల్ కమ్యూనిటీ భవనం, బీఆర్నగర్లో హౌసింగ్కు చెందిన భవనంలో నెలకొల్పాలని, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక ప్రభుత్వ పాఠశాల భవనంలో నెలకొల్పాలని మున్సిపల్ శాఖ అధికారులు ఎంపిక చేశారు. ఈ భవనాలను బస్తీ దవాఖానల నిర్వహణకు అనువుగా మార్చేందుకు ప్రభుత్వం ఒక్కోదాని కోసం రూ.13లక్షల చొప్పున రూ.52లక్షలు మంజూరు చేసింది.
ఈ నిధులతో మున్సిపల్శాఖలోని ఇంజినీరింగ్ విభాగం అధికారులు అవసరమైన పనులు చేపట్టారు. డాక్టర్, ఫార్మసి, ల్యాబ్, నర్స్ గదులు ఉండేలా బస్తీ దవాఖానలను తీర్చిదిద్దుతున్నారు. క్రిస్టియన్కాలని, గిరిప్రసాద్నగర్ బస్తీ దవాఖానల్లో ఈ పనులు దాదాపు పూర్తికాగా, బీఆర్నగర్ బస్తీ దవాఖానలో తుది దశకు చేరాయి.క్రిస్టియన్కాలని, గిరిప్రసాద్నగర్ బస్తీ దవాఖానల ప్రారంభోత్సవానికి అధికారులు ముస్తాబు చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ సుధారాణి, కలెక్టర్ బీ గోపి, డీఎంహెచ్వో వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్వో గోపాల్రావు తదితరులు క్రిస్టియన్కాలని, గిరిప్రసాద్నగర్ బస్తీ దవాఖానలను సోమవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయనున్న బస్తీ దవాఖాన పనుల్లో మున్సిపల్ అధికారులు వేగం పెంచనున్నారు.
ఉదయం 9 నుంచి వైద్య సేవలు
బస్తీ దవాఖానలు ప్రారంభమయ్యాక ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైద్య అధికారి, స్టాఫ్ నర్స్, ఆఫీస్ సబార్డినేట్ విధులు నిర్వర్తిస్తారని డీఎంహెచ్వో కే వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు బస్తీ దవాఖానల నిర్వహణకు ప్రభుత్వం పోస్టులను మంజూరు చేసింది. క్రిస్టియన్కాలని, గిరిప్రసాద్నగర్ బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు డీఎంహెచ్వో వెల్లడించారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులతోపాటు ఏడు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(యూపీహెచ్సీ)లు ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్నాయి. వీటిలో దేశాయిపేట, కాశీబుగ్గ, కీర్తినగర్, ఫోర్ట్వరంగల్, చింతల్, రంగశాయిపేట, ఎస్ఆర్ఆర్తోట యూపీహెచ్సీలు ఉన్నాయి. ఈ యూపీహెచ్సీలకు తోడు కొత్తగా వరంగల్లో ప్రారంభానికి సిద్ధమైన బస్తీ దవాఖానల్లో ప్రజలకు వైద్య సేవలు లభిస్తాయి. బస్తీ దవాఖానల ఏర్పాటుపై స్లమ్ ఏరియా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.