నీలగిరి, మే15 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహణపై అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ నుంచి ఆమె పాల్గొని ఎన్నికల నిర్వహణపై అధికారులకు వివరించారు. శాసన మండలి ఉప ఎన్నిక నిర్వహణకు సరిపడా బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అనుమతులు, ఎన్నికల ప్రచారం, ఎన్నికల ర్యాలీలు, అభ్యర్థులు పాటించాల్సిన నియమాలు, పాటించకూడని అంశాలపై అభ్యర్థులకు బుధవారం జరిగిన సమావేశంలో అవగాహన కల్పించినట్లు తెలిపారు.
బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఏఆర్ఓలు ఎప్పటికప్పుడు రిజిస్టర్ నిర్వహించాలని, అభ్యర్థులకు అనుమతులు మ్యానువల్గా ఇవ్వాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల లాగానే ఎఫ్ఎస్టీ బృందాలు కొనసాగుతాయని తెలిపారు. బ్యాలెట్ బాక్స్లు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు ఎన్నికల అధికారులు సర్ఫరాజ్ అహ్మద్, లోకేశ్ కుమార్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి, చండూరు ఏఆర్ఓ సుబ్రహ్మణ్యం, మిర్యాలగూడ ఏఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.