న్యూశాయంపేట, జనవరి 18 : మూఢ నమ్మకాలను పారదోలడంలో బాలవికాస సంస్థ ముందుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక అన్నారు. ఫాతిమానగర్లో బాల వికాస పీడీటీసీ ట్రైనింగ్ సెంటర్లో ‘నీటి శుద్ధీకరణ పథకాల సుస్థిరతలో గ్రామ పంచాయతీల పాత్ర’ అనే అంశంపై 1500 వాటర్ ప్లాంట్ల కమిటీ సభ్యులతో మహాసభ నిర్వహించారు. 3000 మందితో ఏర్పాటు చేసిన ఈ మహాసభకు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ వినూత్న కార్యక్రమమైనా బాల వికాస నుంచే మొదలవుతుందన్నారు. మహిళా పథకమైనా, చెరువు పూడికతీత, అనాథ పిల్లల రక్షణ, నీటి శుద్ధి ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు.
ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిన బాల వికాస వ్యవస్థాపకురాలు బాలథెరిసాను కొనియడారు. గ్రామీణ వాటర్ ప్లాంట్లకు ఉచిత కరెంట్ అందిస్తే, నిర్వహణకు చార్జీల సమస్య తీరుతుందని కమిటీ సభ్యులు సీతక దృష్టికి తీసుకువచ్చారు. బాల వికాస సంస్థ వ్యవస్థాపకురాలు మాట్లాడుతూ.. సంస్థ ఆధ్వర్యంలో 47 సంవత్సరాలుగా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు ఎంతో మంది దాతలు సహకరించారన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి మాట్లాడుతూ.. వాటర్ప్లాంట్ల నిర్వహణలో గ్రామ పంచాయతీ, కమిటీలదే ముఖ్యపాత్ర అని తెలిపారు. సదస్సులో సోపార్ కెనడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శోభ, బాల వికాస అధ్యక్షుడు నోముల ఇంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు బాసని మర్రెడ్డి, జనవికాస అధ్యక్షుడు లూర్థు మర్రెడ్డి, రైతు వికాస అధ్యక్షుడు కూసం రాజమౌళి, పీడీటీసీ డైరెక్టర్ సునీతారెడ్డి, సీనియర్ మేనేజర్లు ప్రతాప్రెడ్డి, మధుసూదన్రెడ్డి, లత, మంజుల, ఫ్రాన్సిస్రెడ్డి, తిరుపతి, శోభ, శివరాం, మొగిలి, విజేందర్, మోసిస్ జాన్ పాల్, బాల్ రెడ్డి పాల్గొన్నారు.