హనుమకొండ, అక్టోబర్ 10: అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీపీతోపాటు హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, శివలింగయ్య సంయుక్తంగా సమావే శం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ప్రవర్తన నియమావళి సోమవారం నుంచే అమలులోకి వచ్చిందని, డిసెంబర్ 5 వరకు కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. కోడ్ అమల్లోకి వచ్చినందున అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించొద్దని, ముందస్తుగా లిఖిత పూర్వకంగా అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల నుంచి అనుమతులు పొందాలని సూచించారు.
ఇప్పటి నుంచి ఎంసీ ఎంసీ, సోషల్ మీడియా బృందాలు పనిచేస్తాయన్నారు. నవంబర్ 3వ తేదీ నుంచి ఎన్నికల వ్యయ పరిశీలకుల బృందాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. కోడ్ ఉల్లంఘన గురించి ప్రజలు నేరుగా 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈసారి కొత్తగా సీ-విజిల్ యాప్ను కూడా ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిందన్నారు. దీని ద్వారా కోడ్ ఉల్లంఘనపై లైవ్ ఫొటోలు, వీడియోలు తీసి ఈసీ దృష్టికి తేవచ్చని సూచించారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసు బందోబస్త్తోపాటు మైక్రో అబ్జర్వర్స్ పరిశీలిస్తారన్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు పనిచేస్తాయన్నారు.
ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తుగా సమావేశాలు నిర్వహించామని, నోడల్ అధికారులు, సర్వేలెన్స్, ఫ్లయింగ్ స్కాడ్స్, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అధికారులకు కేటాయించిన విధులపై ఇప్పటికే పలు దఫాలు శిక్షణ, సమావేశాలు నిర్వహించామన్నారు. ఎన్నికలు నిర్వహించే సమయంలో సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు, ఇతర ప్రాంతా ల్లో జరిగిన వీడియోలు ఇకడ జరిగినట్లు ప్రచారం చేయడం, పాత వీడియోలను ప్రచారం చేయడం, ప్రజలను అయోమయానికి గురిచేసేలా ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ నగదు, లికర్ సరఫరా జరకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని సీపీ అధికారులకు సూచించారు. సామాజిక మాధ్యమాలలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని, మతాన్ని, ప్రాంతాన్ని, వ్యక్తిని కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని, ఇలాంటి ప్రచారాలు నిర్వహిస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.