పర్వతగిరి, జనవరి 26 : కాకతీయుల కాలం నాటి పర్వతాల శివాలయం పునఃప్రతిష్ఠాపన వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు సుప్రభాత సేవ, మంగళ తోరణాలు, తీర్థనయనం, గోపూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం, దీక్షా స్వీకారం, అఖండ స్థాపన, బ్రహ్మ కలశ స్థాపన, సర్వతోభద్ర మండల దేవతా ఆవాహనం, ఉపపీఠ దేవతల ఆవాహనం పూజ, అగ్ని ప్రతిష్ఠ హోమం, మంత్ర పుష్పనీరాజనాలు, సహస్ర ఘట జలధారాభిషేకం, దేవతామూర్తులకు 1008 బిందెలతో జలాభిషేకం, రుద్ర హవనం, మహా నివేదనం, యాగశాల బలి, శాంతి పాఠం తదితర ఘట్టాలను కనుల పండువగా నిర్వహించారు. ఆలయం ప్రాంగణంలో వేద పండితులు హోమం నిర్వహించారు. అలాగే, శివ లింగానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, భక్తులు జలాభిషేకం నిర్వహించారు. పునఃప్రతిష్ఠాపన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. నంతలక్ష్మి ప్రవచనాలు, రజినీ సిస్టర్స్తో గాన కచేరి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆర్డీఫ్ కళాశాల విద్యార్థులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ చేసిన శివ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
పర్వతగిరి : దైవ పూజలతో మానసిక ప్రశాంతతతో పాటు సమాజహితం చేకూరుతుందని పంచాయతీరా జ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. గురువారం పర్వతాల శివాలయం పునఃప్రతిష్ఠాపన మహోత్సవానికి వచ్చిన ఆయన ఆర్డీఎఫ్ కార్యదర్శి ఎర్రబెల్లి రామ్మోహన్రావుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు చెప్పారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, చింతపట్ల మాలతీసోమేశ్వర్రావు, గోనె సంపత్ తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి : పర్వతాల శివాలయం పునఃప్రతిష్ఠాపన ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు భక్తులకు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా అన్నదానం ఏర్పాట్లను గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరిశీలించారు. శివలింగం ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం పర్వతగిరి బస్టాండ్ నుంచి గుట్టపైకి జీపు సర్వీసులను ప్రారంభించారు. శివయ్య గుడిలో కలియతిరిగి రామ్మోహన్రావుతో కలిసి విద్యార్థులతో శివనామస్మరణలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్గౌడ్, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, చింతపట్ల సోమేశ్వర్రావు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.