భీమదేవరపల్లి, జనవరి 17: కొత్తకొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ఆలయంలో నాగవెల్లి, వసంతోత్సవం కార్యక్రమాలు జరిగాయి. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవమూర్తులకు వసంత మండపంలో నీలలోహిత పూజ నిర్వహించారు. నల్లపూసలను భద్రకాళి అమ్మవారికి ధరింపజేశారు. అనంతరం ఊయల ఊపి సప్తవర్ణాల ఏకాంత సేవ నిర్వహించగా తేజోరూపుడై ఉన్న స్వామి వారిని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం త్రిశూలస్నానం కనులపండువగా జరిగింది. గణపతిపూజ, గవ్యాంతం, మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, మహాకుంభాభిషేకం, అవబృతం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకురాగా ఈవో కిషన్రావు, ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై సాయిబాబు త్రిశూల కలశాలను ఎత్తుకున్నారు. శ్రీశైలం దేవస్థానానికి చెందిన వీరశైవులు మంగళవాయిద్యాల నడుమ వీరభద్ర పల్లేరం చేశారు. వీరశైవులు విన్యాసాలు చేస్తుండగా ఉత్సవమూర్తులను, త్రిశూల కలశాలను పవిత్ర కోనేరుకు తీసుకెళ్లి స్నపనం నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద ఎత్తున కోనేరులో పవిత్రస్నానాలు ఆచరించారు. ఈ త్రిశూల స్నానం చేయడం వల్ల శారీరక రుగ్మతలు తొలగి శరీరం కాంతివంతమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వేకువజామున అగ్నిగుండాలు నిర్వహించనున్నారు. శరభ శరభ అంటూ భక్తులు నిప్పుకణికలపై భక్తిపారవశ్యంతో నడుస్తారు. సాయంత్రం స్వామి వారి గ్రామ పర్యటన ఉంటుంది. ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈవో కిషన్రావు తెలిపారు.