కాజీపేట, ఏప్రిల్ 20: దేశవ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి దశకు చేరుకుంటాయని, ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో మాత్రమే విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని, భవిష్యత్లో డీజిల్ రైలింజన్లు ఉండవని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనజర్ అరుణ్కుమార్ (ఏకే) జైన్ అన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని డీజిల్ లోకో షెడ్ స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కాజీపేటకు ఆయనతోపాటు వివిధ హెచ్వోడీ రైల్వే అధికారులు స్టేషన్ మాస్టర్ సత్యనారాయణరెడ్డి, సీనియర్ డీఎంఈ సందీప్కుమార్ రాగా, పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఆయనతోపాటు పలువురు రైల్వే ఉన్నతాధికారులు రోడ్డుమార్గంలో చింతల్పల్లి రైల్వేస్టేషన్, హసన్పర్తి రోడ్డు రైల్వే స్టేషన్ల వరకు వెళ్లి తనిఖీలు చేపట్టారు.
అనంతరం డీజిల్ లోకో షెడ్కు చేరుకోగా, మహిళాకార్మికులు కోలాటాలతో స్వాగతం పలికారు. డిజీల్ లోకో షెడ్లో ఇటీవల సామర్థ్యం పెంచిన షెడ్, వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. షెడ్లో ఆయిల్ కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టూల్స్, భారత రైల్వే పుట్టినప్పడి నుంచి వాడిన రైలింజన్లు, వివిధ దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీ నోట్ల ఎగ్జిబిషన్ను ఆయన ఆసక్తిగా తిలకించారు. సమావేశ మందిరంలో రైల్వే అధికారులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. అనంతరం డీజిల్ కాలనీ రైల్వే కమ్యూనిటీ హాల్లో సీనియర్ డీఎంఈ సందీప్కుమార్ ఆధ్వర్యంలో షెడ్ స్థాపించినప్పటి నుంచి అభివృద్ధికి పాటుపడిన అధికారులు, రైల్వే కార్మికులను సన్మానించి, మెమెంటోలు అందజేశారు.
అనంతరం షెడ్ 50 వసంతాల సావనీర్ బుక్ను ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా రైల్వే జీఎం మాట్లాడుతూ.. డీజిల్ లోకో షెడ్ 50 వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం అభినందనీయమన్నా రు. భారత దేశంలోనే కాజీపేట రైల్వే డీజిల్ లోకోషెడ్ డీజి ల్ రైలింజన్ల నిర్వహణ నైపుణ్యంలో ప్రత్యేక గుర్తింపును పొందిందన్నారు. డీజిల్ లోకో షెడ్ 21 ఏప్రిల్ 1973లో 38 లోకోలతో ప్రారంభమైన దినదినాభివృద్ధి చెంది కార్మికుల పని నైపుణ్యంలో దక్షిణ మధ్య రైల్వేలోనే మొదటి స్థా నంలో నిలిచిందన్నారు. షెడ్లోని కార్మికులు, అధికారు ల సమన్వయంతోనే పలు ఐఎస్వో సర్టిఫికెట్లు పొందినట్లు తెలిపారు. డీజిల్ లోకో షెడ్లోని కార్మికులు డీఎల్ఎస్, ఈఎల్ఎస్ రైలింజన్లు నిర్వహణను చేపడుతున్నట్లు చెప్పారు.
త్వరలోనే డీజిల్ షెడ్ పూర్తి స్థాయిలో ఈఎల్ఎస్ షెడ్గా మారబోతున్నదన్నారు. షెడ్ కార్మికులకు ఎలాంటి టార్గెట్ ఇచ్చినా పూర్తి చేయగలిగే నైపుణ్య సామర్థ్యం కలిగి ఉన్నారన్నారు. ఎగ్జిబిషన్లో వివిధ రకాల టూల్స్ను తిలకించామని, ఆ టూల్స్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కొంతమంది కార్మికులు చేసే పనిని ఒక్క టూల్స్ చేస్తుందన్నారు. షెడ్ 50వ వార్షికోత్సవం సందర్భంగా షెడ్కు 50వేల నగదు బహుమతిని ఆయన ప్రకటించారు. షెడ్ కార్మికుల ఆరోగ్య దృష్ట్యా పూర్తి స్థాయిలో హెల్త్ యూనిట్ను ప్రకటించారు. అనంతరం కార్మికులు, కార్మికుల పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. పలువురికి బహుమతులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబా ద్ రైల్వే డీఆర్ఎం ఏకే గుప్తా, పీసీఈఈ పీడీ మిశ్రా, పీసీవో ఎం నాగ్య, సీఎల్ఈ తార్య, సీఎంపీ ధర్మేంద్ర, సీనియర్ డీఈఈ (వో) నవీన్, సీనియర్ డీఎస్టీ వెంకట్రాజం, సీనియర్ డీఈఈ అనంత కృష్ణ సాయి, సీనియర్ టీఆర్డీ వాషింగ్ పాషా, డీఎంఈ హనుమానాయక్ పాల్గొన్నారు.