ఐనవోలు, డిసెంబర్ 16: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యారు. ఈ మేరకు శుక్రవారం వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ దృష్టికుంభం ఘనంగా నిర్వహించారు. ఐదు రోజులుగా కొనసాగిన సుధావళి వర్ణలేపనం (స్వామి వారి మూల విరాట్లకు రంగులు అద్దె) కార్యక్రమం గురువారంతో పూర్తయింది. స్వామి వారికి దృష్టి దోశాలు జరుగకుండా శుక్రవారం దృష్టికుంభం నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్లకు రంగులతో తయారు చేసి నేత్రాలకు మైనం పెట్టారు. సూర్యోదయానికి ముందు ఆలయ చుట్టూ పోత్తిపోసి అష్ఠదిగ్బంధనం గావించారు.
అనంతరం కుంభహారతితో మూడు సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గుమ్మడి, నిమ్మ, కొబ్బరికాయలు కొడుతూ వేదపారాయణ చేశారు. స్వామివారికి ఎదురుగా ఉన్న గర్భగుడిలో క్వింటాలు అన్నాన్ని రాశిగా పోసి కుంకుమ హారతులకు వెలింగించారు. అన్నం రాశికి ఎదురుగా దర్పణం (అద్దం), రాశికి అవుతల మేకపిల్లను నిలిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నేత్రాలకు పెట్టిన మైనాన్ని వెనుక నుంచి తొలగించగా, స్వామి వారి మొదటి దృష్టి నేరుగా అన్నం రాశి, దర్పణం, మేకపిల్లపై పడింది. సూర్యోదయానికి ముందే జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ మార్నేని మధుమతి, ఈవో నాగేశ్వర్రావు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మునిగాల సంపత్కుమార్, హసన్పర్తి ఎస్సై భరత్, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, ఆలయ ఉపప్రధాన అర్చకుడు రవీందర్, ముఖ్యఅర్చకులు మధుకర్ శర్మ, శ్రీనివాస్, వేదపారాయణ దారులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం మధుశర్మ, భానుప్రసాద్, నరేశ్ శర్మ, శ్రీనివాస్, దేవేందర్, ఉపసర్పంచ్ సతీశ్కుమార్, వెంకన్న, గ్రామస్తులు నర్సయ్య, అశోక్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.