హనుమకొండ, మే 4 : రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మో సాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హనుమకొండ హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్కు ఎదురుగా ఉన్న సుమారు ఐ దెకరాల స్థలంలో పనులు ముమ్మరమయ్యాయి. ఈ సదస్సుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 10వేల మంది రైతు ప్రతినిథులు హాజరు కానున్న నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకొనేలా జర్మనీ టెంట్లు వేస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద కూలర్లు సమకూర్చుతున్నారు. పది వేల మందికి సరిపడేలా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి పల్లె నుంచి రైతు ప్రతినిథులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని, మక్కజొన్న, వడ్లు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంపై నేరుగా గ్రామాల్లో, మార్కెట్ యార్డులకు వెళ్లి బీఆర్ఎస్ నేతలు వివరిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలను వివరిస్తున్నారు.
అలాగే గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందో విశ్లేషించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. కాగా రైతు సంగ్రామ సదస్సు ప్రాంగణాన్ని, పార్కింగ్ స్థలాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, కేతిరి వాసుదేవరెడ్డి తదితరులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కొలంబియా మెడికల్ కాలేజ్ గ్రౌండ్, ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, వర్థన్నపేట నియోజక వర్గాలకు చెందిన వాహనాలు, తేజస్వీ స్కూల్ గ్రౌండ్తో పాటు, భారత్ పెట్రోల్ పంపుకు ఎదురుగా ఉన్న స్థలంలో స్టేషన్ఘన్పుర్, పరకాల, భూపాలపల్లి నియోజక వర్గాల వాహనాలు, పాపడమ్స్ ఎదురుగా ఉన్న పద్మాలయ ఫంక్షన్ హా ల్లో జనగామ నియోజకవర్గంతో పాటు జనరల్ వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు.