మహబూబాబాద్, జనవరి 9 : (నమస్తే తెలంగాణ) సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను కోరారు. ఈ నెల 12న మహబూబాబాద్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న సందర్భంగా సోమవారం మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, జడ్పీ చైర్ పర్సన్ బిందుతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే మానుకోట జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. నాలుగు దశాబ్దాలుగా జిల్లాతో తనకు అనుబంధం ఉందన్నారు. కొంత మంది మూర్ఖులు ఎప్పుడు ఏదేదో మాట్లాడుతారు.. కానీ జిల్లా ప్రజలుగా నాయకులుగా మనం సమీక్ష చేసుకోవాలన్నారు. మానుకోటకు మెడికల్ కాలేజీ, కాళేశ్వరం జ లాలు, 24 గంటల విద్యుత్ వస్తుందని ఎవరైనా ఊహించారా అని ఆయన పేర్కొన్నారు. నెల రోజుల వ్యవదిలోనే పోడు భూముల సమస్యను పరిష్కరి స్తామని, అనంతరం బహిరంగ సభ ఏ ర్పాటు చేస్తామన్నారు.
కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పార్టీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సీఎం కేసీఆర్ మాట్లాడుతారని ఎర్రబెల్లి తెలిపారు. ఇక్కడే భోజనం చేసిన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం వెళ్తారన్నారు. ఇప్పటికే జిల్లాకు సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. గతంలో కలెక్టర్ వద్దకు వెళ్లాంటే వరంగల్కు వెళ్లాల్సి వచ్చేదన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఇక్కడే నిర్మించామని, ప్రారంభోత్సవం నాటికీ రోడ్డు బాగు చేయాలని, పచ్చదనం పెంచాలన్నారు. అధికారులు సమన్వయం చేసుకుని సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు వస్తారని తెలిపారు. అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం మాట్లాడుతారన్నారు.
పొరుగు రాష్ర్టాల్లోని సచివాలయాలు కూడా ఇలా లేవు : సత్యవతి
దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఉన్న కలెక్టరేట్ల మాదిరిగా పొరుగు రాష్ర్టాల్లోని సచివాలయాలు కూడా లేవని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 18 జిల్లాల్లో కలెక్టరేట్లు ప్రారంభించామని తెలిపారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఎంతో ప్రేమతో జిల్లా ను ఇచ్చారని, అంతే ప్రేమతో అభివృద్ధి చేస్తున్నారని ఆమె వివరించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ శశాంక, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఇదే..
సీఎం కేసీఆర్ ఈ నెల 12న ఉదయం 10 గంటలకు హెలీక్యాప్టర్ ద్వారా మహబూబాబాద్లోని గిరిజన భవనం సమీపంలో చేరుకుంటారు. 10.30 గంటలకు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభింస్తారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా నూతన కలెక్టరేట్కు చేరుకుంటారు. 11 గంటలకు కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి జిల్లాలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్షిస్తారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తారు.