-వరంగల్, డిసెంబర్ 7 (నమస్తేతెలంగాణ) : చారిత్రక వరంగల్ను హెల్త్సిటీగా మార్చే మహోన్నత సంకల్పంతో ఇక్కడ నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అన్ని హంగులతో కట్టే ఈ మహా వైద్యశాల కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ఆర్అండ్బీ శాఖ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. సాంకేతిక అనుమతుల కోసం సమగ్ర అంచనాలు రూపొందిస్తున్నది. 24అంతస్తులతో భవనం నిర్మించే స్థలంలో మట్టి నమూనాల సేకరణను ముమ్మరం చేసింది. జనవరిలో పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ముందుకు పోతున్నది.
వరంగల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. 24 అంతస్తుల తో ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం గత జూన్ 21న సీ ఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. రెండు వేల పడుకల సామర్థ్యంతో దవాఖాన నిర్మించే బాధ్యతలను ప్రభు త్వం ఆర్అండ్బీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆర్అండ్బీ ఇంజినీర్లు హాస్పిటల్ నిర్మాణం కోసం ఎస్టిమేట్స్ తయారు చేశారు. పరిశీలించిన ప్రభుత్వం దవాఖాన నిర్మాణానికి రూ.1,100 కోట్లతో గత శనివారం పాలనపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సివిల్ వర్క్స్కు రూ.509కోట్లు, మంచినీరు, పారిశుధ్యం కోసం రూ.20.36, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్కు రూ.182.18, వైద్య పరికరాలకు రూ.105, అనుబంధ పనులకు రూ.54.28, చట్టబద్దమైన పనులు, పన్నులకు రూ.229.18 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. అత్యవసర వైద్య సేవలు అందేలా ఎయిర్ అంబులెన్స్(హెలికాప్టర్)ను వినియోగించేందుకు ఈ 24 అంతస్తుల భవనంపై హెలిపాడ్ కూడా రూపుదిద్దుకోనుంది. త్వరలోనే తమకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రానుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మట్టి నమూనాల సేకరణ..
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సోమవారం హైదరాబాద్లో దవాఖానలు, మెడికల్ కాలేజీ ల నిర్మాణాలపై వైద్య, ఆర్అండ్బీ శాఖల ఉన్నతాధికారులు, డిజైనింగ్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. వరంగల్లో ప్రతిష్ఠాత్మకంగా రూ.1,100 కోట్లతో ని ర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఈ సమావేశంలో మంత్రి ఆదేశించారు. ఇప్పటికే పాలనా అనుమతులు మంజూరైనందున జనవరి మొ దటి వారంలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి ఇక్కడ మట్టి నమూనాల సేకరణ ప్రారంభమైంది. భ వనం నిర్మించే స్థలంలో ఐదు పాయింట్ల ద్వారా మట్టి నమూనాలు సేకరించేందుకు ఆర్అండ్బీ అధికారులు నిర్ణయించారు. ఒక్కో పాయింటులో 30 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేస్తున్నారు. ప్రతి మీటర్కు నమూనా లు సేకరిస్తున్నారు. మూడు నాలుగు రోజుల్లో ఈ ప్రక్రి య పూర్తి చేసే పనుల్లో తలమునకలయ్యారు.
త్వరలో టెండర్ల ప్రక్రియ..
ప్రభుత్వ ఆదేశాలతో నెలాఖరులోగా రూ.1,100 కోట్లతో దవాఖాన భవన నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలనే పట్టుదలతో ఆర్అండ్బీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో హాస్పిటల్ భవన నిర్మాణానికి సంబంధించి పనివారీగా టెక్నికల్ సాంక్షన్ కోసం సమగ్ర అంచనాలు రూపొందిస్తున్నా రు. అంచనాల తయారీ పూర్తికాగానే ప్రభుత్వం నుంచి రూ.1,100 కోట్ల పనులకు సాంకేతికపరమైన అనుమతుల మంజూరు పొంది వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టే పనిలో ఉన్నారు. గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తయితే జనవరిలో హాస్పిటల్ భవన నిర్మాణ పనులు ప్రారంభించొచ్చనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. మట్టి నమూనాల సేకరణ, టెక్నికల్ సాంక్షన్ కోసం అంచనాల తయారీ తదితర అంశాలపై మంగళవారం హైదరాబాద్లో ఆర్అండ్బీ ఈఎన్సీ హాస్పిటల్ భవన నిర్మాణ పనులకు సంబంధించిన ఆర్అండ్బీ ఇంజినీర్లతో సమావేశమైనట్లు తెలిసింది.