రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరిట చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైంది. అర్జీలు సమర్పించేందుకు ప్రజలు కేంద్రాల్లో బారులు తీరి కనిపించారు. చాలాచోట్ల ఇంటింటికీ దరఖాస్తులు అందినా, కొన్నిచోట్ల అమలు కాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జిరాక్స్ సెంటర్లలో డబ్బులు వెచ్చించి మరీ దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేసి సమర్పించారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, 200 యూనిట్ల కరెంటు, కొత్త రేషన్ కార్డులకోసం దరఖాస్తులు ఇచ్చే విషయంలో అయోమయానికి లోనయ్యారు.
మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం వంటి ఆరు గ్యారెంటీల కోసం తొలిరోజు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. రెండు పేజీల ఫారంలో దరఖాస్తుదారుకు సంబంధించిన కుటుంబ వివరాలు రాయాలని, దరఖాస్తుకు ఆధార్కార్డు, తెల్ల రేషన్కార్డు జిరాక్స్ ప్రతిని జత చేయాలని సూచించారు. మొదటి పేజీలో ఆధార్ నంబర్, పుట్టినతేదీ, రేషన్కార్డు నంబర్ అడిగారు. దరఖాస్తు ఫారంలో కొత్త రేషన్కార్డు కోసం ప్రత్యేకంగా కాలమ్ లేకపోవడంతో తెల్లకాగితంపై రాసి ఇవ్వాల్సి వస్తున్నది. ఇల్లులేని అర్హులైన కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం కాలమ్ మాత్రమే ఉండగా సొంత స్థలం లేక అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురయ్యారు. దీనికోసం కూడా ప్రత్యేకంగా తెల్లకాగితంపై రాసి ఇవ్వడం కనిపించింది. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కాలమ్లో వాడుకునే యూనిట్ల సంఖ్యపైనా అయోమయం నెలకొంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అద్దె ఇంట్లో ఉండేవారికి ఎలా వర్తిస్తుందో తెలియక గందరగోళం నెలకొంది. ఒకే దరఖాస్తుతో ఆధార్, రేషన్కార్డు జిరాక్స్ ఇవ్వచ్చని చెప్పి కౌంటర్ వద్దకు వెళ్లిన వారికి తెల్లకాగితంపై రాసిచ్చే దరఖాస్తుకు అదనంగా జిరాక్స్ ప్రతులు అడగడంతో జిరాక్స్ సెంటర్లకు ప్రజలు పరుగులు తీయడం కనిపించింది.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, జనగామలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, దొంతిమాధవరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, మురళీనాయక్, రాంచంద్రునాయక్, రేవూరి ప్రకాశ్రెడ్డి, స్టేషన్ఘన్పూర్లో అధికారులు అర్జీల స్వీకరణను పర్యవేక్షించారు. ఒక గ్రామంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మరో గ్రామంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దరఖాస్తులు తీసుకున్నారు. కొన్ని గ్రామాల్లో పొలం పనులకు వెళ్లిన వారు సాయంత్రం వచ్చే సరికే అధికారులు వెళ్లిపోవడంతో హైరానా పడ్డారు. స్థానిక నాయకులు, అధికారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, లేదంటే పక్క ఊరికి వెళ్లి దరఖాస్తు ఇవ్వాలని సూచించడం కనిపించింది.
ఇంటింటికీ దరఖాస్తు ఫారాలు అందిస్తామని అధికారులు చెప్పినా కొన్ని చోట్ల అమలు కాకపోడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఫారాలు అందక జిరాక్స్ సెంటర్లకు పరుగులు తీసి కొనుగోలు చేశారు. ఇదే అదునుగా సెంటర్లలో బ్లాక్ అండ్వైట్ దరఖాస్తుకు రూ.10 నుంచి రూ.15 చొప్పున, కలర్ జిరాక్స్కు రూ.20నుంచి రూ.30 చొప్పున వసూలు చేశారు. దరఖాస్తులను పూరించే విషయంలోనూ చాలామంది అయోమయానికి లోనయ్యారు.కుటుంబ యజమాని పేరు పురుషుడు, మహిళల్లో ఎవరిది రాయాలని గందరగోళపడ్డారు.
వరంగల్ నగరంలో మొదటి రోజు గంటలోపే దరఖాస్తులు అయిపోయాయని సిబ్బంది చెప్పడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని 30వ డివిజన్ శ్రీనివాసనగర్, 51వ డివిజన్ వాటర్ ట్యాంకు వద్ద, 5వ డివిజన్ కొత్తూరుజెండా కమ్యూనిటీ హాల్ వద్ద, 4వ డివిజన్లో యాదవనగర్ కమిటీ హాల్, పెద్దమ్మగడ్డ కమ్యూనిటీ హాల్లో దరఖాస్తులు ఎందుకివ్వడం లేదని అధికారులను నిలదీశారు. చివరకు బయట జిరాక్స్షాపులో కొనుగోలుచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో అక్కడికి పరుగులు పెట్టారు. 27వ డివిజన్ స్టేషన్ రోడ్లోని బాపూజీ విజ్ఞాన కేంద్రం, 36వ డివిజన్లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో దరఖాస్తులు ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఫారాల కోసం వేచివున్న మహిళలు ఆందోళన చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులను నిలదీశారు. 19,20వ డివిజన్లలో ఫారాలు లేక పోవడంతో చాలామంది నిరాశతో వెనుదిరిగారు.