వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 25: వరంగల్ ఎంజీఎం దవాఖానలో మరో కరోనా జేఎన్1 కేసు నమోదైంది. ఇదివరకే భూపాలపల్లి జిల్లాకు చెందిన మహిళ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈమె కుటుంబసభ్యులు నలుగురికి కూడా పాజిటివ్ రావడంతో హోం ఐసొలేషన్లో కోలుకుంటున్నారు. ఆదివారం వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రాంతానికి చెందిన మహిళ అనారోగ్యంగా ఉందని ఎంజీఎం వైద్యులను ఆశ్రయించింది. లక్షణాలను గుర్తించిన వైద్యులు నమూనాలు సేకరించి ల్యాబ్ పంపించారు. సోమవారం అందిన ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా సదరు మహిళకు కరోనా జేఎన్ 1 కరోనా సోకినట్లు గుర్తించినట్లు ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
బాధితురాలికి కొవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ వార్డులో ప్రస్తుతం ఇద్దరు మహిళలు చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాధితురాలి వివరాలను జిల్లా వైద్యాధికారికి తెలిపామని, ఆమె కుటుంబసభ్యులకు సైతం పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కరోనా లక్షణాలు గుర్తించిన వారు నేరుగా ఎంజీఎం దవాఖానలోని కొవిడ్ వార్డులో ఏర్పాటు చేసిన రాపిడ్ టెస్ట్ సెంటర్లో పరీక్షలు చేయించుకోవచ్చునని తెలిపారు.