టేకుమట్ల, మే 25 : ఉమ్మడి పాలనలో జిల్లాకేంద్రాల్లోని గ్రంథాలయాలే దిక్కులేకుండా పోయేది. ఇక మారుమూల గ్రామాల్లో లైబ్రరీ అంటే కలగానే మిగిలేది. తెలంగాణ వచ్చాక జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాలన మారుమూల ప్రాంతాలకు చేరడమే కాదు.. రాష్ర్టానికే చివరన ఉన్న పల్లెల్లోనూ మెరుగైన వసతులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగార్థులకు విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయాలు బలోపేతమయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలో ఎంపేడు గ్రామం జిల్లాకు చిట్ట చివరన సరిహద్దులో ఉంటుంది. ఈ గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న గ్రంథాలయం ఎంతో ఆకర్షణీయంగా ఉన్నది. ఊరిలోని పాత జీపీ భవనానికి మరమ్మతులు చేసి ఆకట్టుకునే చిత్రాలతో అందంగా తీర్చిదిద్ది లైబ్రరీగా మార్చారు. పనులు చివరిదశకు చేరుకోగా త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత మారుమూల ప్రాంతాల్లోనూ వస్తున్న విప్లవాత్మక మార్పులకు ఇది ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది. తమ ఊరిలోనూ ఎంతో ఆకర్షణీయమైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి గ్రామస్తులు కృతజ్ఞతలు చెబుతున్నారు.