సుబేదారి, అక్టోబర్ 13 : వరంగల్ పోలీసు కమిషనర్గా అంబర్ కిశోర్ ఝా శుక్రవారం విధుల్లో చేరారు. ఆయన గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ కాగా, ఆయన స్థానంలో అంబర్ కిశోర్ ఝాను రాష్ట్ర సర్కారు సీపీగా నియమించింది. 2009 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన మొదట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏఎస్పీగా పని చేశారు. 2012లో ఉమ్మడి వరంగల్ ఓఎడ్డీగా, అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఎస్పీగా పదోన్నతి పొంది 2014లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత భద్రాద్రి కొత్తగూడెం తొలి ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా, అదే సంవత్సరంలో కేంద్ర సర్వీసుల్లో చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డీఐజీగా పదోన్నతి పొందారు. ఇటీవల రాచకొండ జాయింట్ సీపీగా నియమితులయ్యారు. కాగా, నూతన సీపీని సెంట్రల్, వెస్ట్ జోన్ డీసీపీలు బారి, సీతారాం, ఇతర పోలీసు అధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.