‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ అన్న మహత్మాగాంధీ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అమలు చేసిన ‘పల్లె ప్రగతి’ అద్భుత ఫలితాలనిస్తున్నది. పక్కాగా అమలైన అభివృద్ధి ప్రణాళికల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు జనగామ, హనుమకొండ జిల్లాలను వరించాయి. కేంద్ర పారిశుధ్య మంత్రిత్వశాఖ శుక్రవారం సాయంత్రం ఫలితాలు ప్రకటించగా, ‘స్వచ్ఛ సర్వేక్షణ్ హై అచీవర్స్’ కేటగిరీలో జనగామ జిల్లా, అచీవర్స్ కేటగిరీలో హనుమకొండ జిల్లా దేశంలోనే టాప్-2లో నిలిచాయి. వివిధ అంశాల్లో 300/300 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను చాటాయి. మన రాష్ట్రం నుంచి ఈ సారి మొత్తం నాలుగు జిల్లాలకు అవార్డులు రాగా, వీటిలో రెండు ఉమ్మడి వరంగల్కు చెందినవే ఉన్నాయి.
వరంగల్, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జనగామ (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో మన గ్రామాల్లో వెల్లివిరుస్తున్న ప్రగతి వికాసాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి గుర్తించింది. మన పల్లెల్లో ఉన్న స్వచ్ఛతకు గుర్తింపుగా మరోసారి అవార్డులు ప్రకటించింది. గ్రామీణ వికాసంలో జనగామ, హనుమకొండ జిల్లాలు ముందున్నాయని తేలింది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ జూన్-2023’ నివేదికను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం విడుదల చేయగా, హై అచీవర్స్’ కేటగిరీలో జనగామ జిల్లా, అచీవర్స్ కేటగిరీలో హనుమకొండ జిల్లా దేశంలోనే టాప్-2లో నిలిచాయి.
ఈ అవార్డుల్లో ఉమ్మడి జిల్లా మరోసారి సత్తా చాటింది. తెలంగాణకు ఈ సారి మొత్తం నాలుగు జిల్లాలకు అవార్డులు రాగా వీటిలో రెండు ఉమ్మడి వరంగల్లోనే ఉన్నాయి. 2022 అక్టోబర్ నుంంచి 2023 జూలై 14 వరకు జిల్లాల్లో జరిగిన పారిశుధ్య ప్రగతి సహా గ్రామాల్లో సెగ్రిగేషన్ షెడ్లు, చెత్త సేకరణ, రవాణా, ట్రాక్టర్లు, ట్రాలీల వినియోగం, మురుగునీటి నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లు, గ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన చిత్రాలు, వాల్ పెయింటింగ్స్, పరిసరాల పరిశుభ్రత, ఎస్బీఎం ఫేజ్-2పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు వంటి వివిధ అంశాల్లో 300 మార్కులకు గానూ 300 సాధించి దేశంలోనే టాప్-2గా జనగామ, హనుమకొండ జిల్లాలు నిలిచాయి.
దశ మార్చిన పల్లె, పట్టణ ప్రగతి..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఇటు గ్రామాలు, అటు పట్టణాలు, నగరాలకు కొత్త దశను తెచ్చాయి. గ్రామాలు, పట్టణాల్లో అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. పచ్చదనం, పరిశుభ్రతతో పల్లెలన్నీ వెల్లివిరుస్తున్నాయి. ప్రతి ఊరిలో పార్కు, గ్రామీణ క్రీడా ప్రాంగణం రూపుదిద్దుకున్నది. పిల్లలు, యువత ఆరోగ్యం కోసం ఇవి దో హదపడున్నాయి. ప్రతి ఊరు స్వచ్ఛంగా ఉండాలని, ని రంతరం పారిశుధ్య నిర్వహణ ఉండాలనే లక్ష్యంతో సీ ఎం కేసీఆర్ పల్లె ప్రగతిని చేపట్టారు. రోజూ ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి డంప్యార్డుకు తరలించేలా ఏ ర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రతి ఊరికీ ట్రాక్టరును అం దుబాటులోకి తెచ్చారు. పారిశుధ్య కార్మికుల వేతనాన్ని పెంచారు.
ప్రతి ఇంటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. రోజూ సేకరించే చెత్తను డంప్యార్డుకు తరలించి కంపోస్టుగా మార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెత్త నిర్వహణ పకడ్బందీగా ఉండడంతో ఊర్లన్నీ శుభ్రంగా ఉంటున్నాయి. మనిషి చివరి మజిలీ ప్రశాంతంగా పూర్తికావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరిలో వైకుంఠధామాలను నిర్మించింది. నీటి సరఫరా, మహిళలకు దుస్తులు మార్చుకునే గది, ఇతర వసతులను కల్పించింది. ప్రతి ఊరిలో సీసీ రోడ్లు వేసింది. రోజూ శుద్ధమైన తాగునీటిని సరఫరా చేస్తున్నది. అన్ని రకాల వసతులతో పల్లెలు ఇప్పుడు సరికొత్తగా మారాయి. దీనికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం అవార్డులను ఇస్తున్నది. జనగామ, హనుమకొండతో పాటు వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు సైతం సమగ్ర వికాసంలో మంచి స్కోర్తో ముందున్నాయి.
జిల్లాకు అరుదైన గుర్తింపు..
– సీహెచ్ శివలింగయ్య, జనగామ కలెక్టర్
స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో దేశంలోనే జనగామ జిల్లా నంబర్-2 స్థానంలో నిలవడం హర్షించదగ్గ విషయం. పల్లె ప్రగతి కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో భాగస్వాములైన సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులకు అభినందనలు. ఈ నెలలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు జిల్లాను సందర్శిస్తారు. జిల్లాలోని 281 గ్రామాల్లో కనీసం 35 గ్రామాలను కేంద్ర బృందాలు తనిఖీ చేస్తాయి. ఇందుకు అనుగుణంగా అందరూ సమాయత్తం కావాలి.
పల్లె ప్రగతితోనే మార్పు..
– ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్లే స్వచ్ఛ సర్వేక్షణ్లో తెలంగాణ రాష్ర్టానికి వరుసగా అవార్డులు వస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్లో సత్ఫలితాలు సాధించిన జిల్లాలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలకు అభినందనలు. గ్రామాలను మరింతగా అభివృద్ధి చేసుకొని మరిన్ని అవార్డులను దక్కించుకోవాలి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అవే రాష్ర్టాన్ని స్వచ్ఛ తెలంగాణగా మార్చాయి.