వరంగల్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓరుగల్లు ప్రజానీకం ఆశలపై ‘నిర్మలమ్మ’ నీళ్లు జల్లింది. పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు కేంద్రం మొండి చెయ్యి చూపింది. 9ఏళ్లుగా నానుతున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఊసెత్తకపోవడంతో వేలాది మంది యువత ఉపాధి ఆశలు ఆవిరయ్యాయి. మేడారం జాతరకు జాతీయ స్థాయి గుర్తింపు మాటెత్తకపోగా, గిరిజన వర్సిటీలకు ఏమూలకూ చాలని నిధులు విదిల్చడంపై అడవిబిడ్డల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మరోవైపు ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టడం, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా నిర్ణయాలు లేకపోవడంతో ఇటు కూలీలు, అటు రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది. మరోవైపు నేతన్నలకు ఎలాంటి ప్రోత్సాహకాలూ ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పార్లమెంట్ సాక్షిగా బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు నిరాశే మిగిలింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి ఓరుగల్లుకు అన్యాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు గుర్తు చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. పునర్విభజన చట్టంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు మంజూరు కావాల్సిన వాటిని మరోసారి దాట వేసింది. పునర్విభజన హామీలను నెరవేర్చకపోగా కొత్తగా ఎలాంటి ప్రాజెక్టునూ మంజూరు చేయలేదు. దీర్ఘకాలికంగా ప్రజలు డిమాండ్ చేస్తున్న వాటినీ నెరవేర్చలేదు. 2014లో పార్లమెంటులో చేసిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారంపై తాజా బడ్జెట్లోనూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
నాలుగున్నర దశాబ్దాలుగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎదురుచూస్తున్న వరంగల్ యువత ఆశలపై కేంద్రం నీళ్లుజల్లింది. రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి రూ.400కోట్ల నిధులు కేటాయించాలనే డిమాండ్నూ కేంద్రం పట్టించుకోలేదు. విభజన చట్టంలోనే పేర్కొన్న గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపైనా అదే గందరగోళం కొనసాగుతున్నది. తెలుగు రాష్ర్టాల్లోని రెండు గిరిజన యూనివర్సిటీలకు రూ.37కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీ ఇప్పటికే మొదలైనా తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఇంకా ఏర్పాటు కాలేదు. కొత్తగా ప్రారంభించే యూనివర్సిటీకి ఈ మొత్తం ఏమేరకు సరిపోతుందని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు జాతీయ గుర్తింపునూ కేంద్రం అటకెక్కించింది. అన్ని వసతులూ ఉన్న మామునూరు ప్రాంతీయ విమానాశ్రయం అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, పెద్దపల్లి వంటి ఇరుగుపొరుగు జిల్లాల్లోనూ పత్తి సాగు ఎక్కువ ఉంటుంది. సీసీఐ కొనుగోలు కేంద్రాలు వ్యాపారులకు పోటీగా పత్తి కొనుగోలు చేస్తుంటాయి. కాగా కేంద్రం గతేడాది బడ్జెట్లో సీసీఐకి రూ.9243 కోట్లు కేటాయించగా ఈసారి కేవలం లక్ష రూపాయలు కేటాయించినట్లు పేర్కొనడం విస్తుగొలుపుతున్నది. సీసీఐ వద్ద నిధులు లేకపోతే పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసే పరిస్థితి ఉండదు. దీంతో వ్యాపారులు చెప్పిన ధరకే రైతులు పంటను అమ్ముకోవాల్సి వస్తుంది. కేంద్రం తాజా నిర్ణయంతో పత్తి రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది.
గిరిజన జనాభా ఎక్కువగా ఉండే మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుపై బడ్జెట్లో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, చారిత్రక వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, కోటగుళ్లు వంటి చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి ఏమేరకు నిధులు కేటాయిస్తారన్నది స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగరాన్ని మెడికల్ సిటీగా అభివృద్ధి చేస్తున్నది. దేశవ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రం, వరంగల్కు ఒక్క కాలేజీనీ మంజూరు చేయకపోవడంపై ఓరుగల్లు ప్రజలు మండిపడుతున్నారు.హనుమకొండ సబర్బన్ : కేంద్ర ప్రభుత్వం మొదటినుంచి చేనేత కార్మికులపై చిన్నచూపు చూస్తున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి చేనేత కార్మికులను ఆదుకుని ఆత్మహత్యలను తగ్గిస్తున్నది.
మోదీ సర్కారు మాత్రం చేనేత వస్ర్తాలపై కూడా జీఎస్టీ వేసి తన వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు ఈ బడ్జెట్లోనైనా కనికరిస్తుందనుకుంటే మొండిచెయ్యే చూపింది. కులవృత్తులను పూర్తిగా తుడిచిపెట్టే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో చేనేత బీమా పథకాన్ని, హెల్త్కార్డులను కూడా తీసేసింది. మోదీ వచ్చినప్పటి నుంచి అన్యాయమే జరుగుతోంది. కేసీఆర్ సర్కారు మాత్రం చేనేతమిత్ర ద్వారా 40శాతం వరకు రాయితీ ఇస్తున్నది. నేతన్నకు చేయూత పథకంలో కేంద్రం గతంలో 4శాతం ఇచ్చేది. ఇప్పుడు రూపాయి కూడా ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే 16శాతం ఇచ్చి ఆదుకుంటోంది. రుణమాఫీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేసింది. రైతులకిచ్చినట్లే చేనేత కార్మికుడు చనిపోతే రూ.5 లక్షలు బీమా ఇస్తున్నది. కేంద్రం మాత్రం పైసా ఇవ్వడం లేదు.
– వేముల సమ్మయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు, సూరారం, ఎల్కతుర్తి మండలం
రైల్వే లైన్కు కేంద్రం మొండిచేయి
కొడకండ్ల: తెలంగాణపై అడుగడుగునా వివక్షతో వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న స్టేషన్ఘన్పూర్-సూర్యాపేట రైల్వే లైన్ నేటికీ సర్వేకు నోచుకోవడం లేదు. దీంతో పాలకుర్తి, కొడకండ్ల, తిరుమలగిరి ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరడం లేదు. గతంలో రాపోలు ఆనంద్భాస్కర్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పలుమార్లు కేంద్రానికి విన్నవించినా స్పందన లేదు. తెలంగాణ ప్రాంత బీఆర్ఎస్ ఎంపీలు సైతం ప్రతిపాదనలు పంపినా ఈసారి బడ్జెట్లోనూ మొండిచేయి చూపారు. ప్రధాని మోదీ విధానాలపై ప్రజలు ఉద్యమించాలి.
– పసునూరి మధుసూదన్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు
ఆదాయపు పన్ను పరిమితి రూ.10లక్షలకు పెంచాలి
మరిపెడ : ఆదాయ పన్ను పరిమితిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐదు లక్షలను ఏడు లక్షలకు పరిమితం చేశారు. పన్ను పరిమితిని రూ.10లక్షలకు పెంచితే వేతనజీవులకు ఊరట కలుగుతుంది. విదేశీ సుంకం పెంచడం మూలాన పలు వ్యాపార, వాణిజ్య సంస్థలపై దుష్ప్రభావం పడుతుంది. స్వయంఉపాధి రంగాలకు అరకొర నిధులు కేటాయించారు. రోడ్లు రహదారుల నిర్మాణం కోసం రూ.75వేల కోట్లే కేటాయించడం విచారకరం.
– వుప్పల వెంకటేశ్వర్లు, వ్యాపారవేత్త, మరిపెడ
వ్యవసాయరంగం ఊసేలేదు..
డోర్నకల్ : మోదీ సర్కారు వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తున్నది. గతంలో కేంద్రం రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది. ప్రధాని మోదీ తీసుకొచ్చిన నల్లచట్టాలను ఇప్పటివరకు ఉపసంహరించుకోలేదు. రైతులపై భారం వేస్తూ ఎరువులు, విత్తనాల పై సబ్సిడీలను ఎత్తివేసింది. కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో వ్యవసాయరంగం ఊసే లేకపోవడం చాలా బాధాకరం.
– ఉప్పెనపల్లి శ్రీనివాస్, జిల్లా వ్య.కా.స సహాయ కార్యదర్శి
నిరుద్యోగులకు నిరాశే..
భూపాలపల్లి రూరల్ : కేంద్ర బడ్జెట్తో ఒరిగేదేమీ లేదు. త్వరలో ఎన్నికలున్న రాష్ర్టాలకు మాత్రమే ఈ బడ్జెట్ అనుకూలంగా ఉంది. కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్నందున ఎగువ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినా బడ్జెట్లో మొండిచేయి చూపారు. ఇక నిరుద్యోగులు, రైతులకు మళ్లీ నిరాశే కలిగించారు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా లేదు. వ్యవసాయరంగానికి కేవలం రూ.1.25 లక్షల కోట్ల ను మాత్రమే కేటాయించారు.
– తాటికంటి నరేశ్, తెలంగాణ పట్టభద్రుల నిరుద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు