ఏటూరునాగారం, జనవరి 20 : ఏటూరునాగారం ఐటీడీఏలో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు లంచం తీసుకుంటూ శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులకు చిక్కడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం డీఈఈ నవీన్, ఏఈఈ ఎమ్డీ అబీద్ఖాన్ కాం ట్రాక్టర్ సంజీవ నుంచి రూ. 50వేలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడ్డారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ కే సుదర్శన్ వెల్లడించిన వివరాల మేరకు.. 2022 మహా జాతర సందర్భంగా ములుగుకు చెందిన సంజీవ అనే కాంట్రాక్టర్తో పాటు మరో నలుగురు కలిసి రూ.16లక్షల పెయింటింగ్ పనులు చేశారు. ఇందు కు సంబంధించిన బిల్లులు డిసెంబర్లోనే పాస్ అయ్యాయి. కానీ, చెల్లించేందుకు డీఈఈ నవీన్, ఏఈఈ అబీద్ రూ.90 వేలు లంచం డిమాండ్ చేశారు.
రూ. 80వేలు ఇస్తానని సంజీవ బతిలాడినా రూ.90వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో చేసేదేంలేక రూ.50వేలు ఇచ్చి బిల్లులు వచ్చిన తర్వాత మరో రూ.40వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనెల 10న కాంట్రాక్టర్ సంజీవ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఐటీడీఏలో సంజీవ నుంచి ఏఈఈ అబీద్ఖాన్ రూ.50వేలు తీసుకుంటుండగా వలపన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు శ్యాం, రవి, శ్రీను, మరో పదిమంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.
కార్యాలయంలో సోదాలు
డీఈఈ, ఏఈఈలను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు గంట పాటు ఐటీడీఏ కార్యాలయాన్ని తమ ఆధీనంలో ఉంచుకొని ఇంజినీరింగ్ విభాగంలోని డీఈఈ, ఏఈఈల గదులను తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ సెక్షన్లో ఉన్న ఒకరిద్దరు ఉద్యోగులు భయపడి పరుగులు తీశారు.
సాయంత్రం దాకా వేచి చూసి..
మేడారంలో పనులను పర్యవేక్షించిన డీఈఈ, ఏఈఈలు సాయంత్రం ఐటీడీఏకు చేరుకున్నారు. కార్యాలయం సమయం దాటినా లంచం కోసం వేచి ఉన్నారు. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా అక్కడే కాపుకాసిన ఏసీబీ అధికారులు పట్టుకునే ప్రయత్నంలో ఏఈఈ అబీద్ పారిపోయే ప్రయత్నం చేశాడు. సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి ఐటీడీఏలో హడావుడి చూసి అసలు ఏం జరుగుతున్నదోనని స్థానికులందరూ చర్చించుకున్నారు.