నర్సింహులపేట, అక్టోబర్ 7 : సమైక్యపాలకుల హయాంలో అర్హతలున్నా సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షే అయ్యేవి. కాళ్లరిగేలా తిరిగినా ఏ పథకానికీ నోచుకోక ఆవేదన చెందాల్సి పరిస్థితులుండేవి. కేవలం పలుకుబడి ఉన్న వారికే తప్ప ‘సర్కారు సాయం’ అందిన దాఖలాలు లేవు. కానీ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ సర్కారు పాలనలో అందుకు భిన్నంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకం దరిచేరుతున్నది. మంజూరు కాగానే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతున్నాయి. ఫలితంగా పేదల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తున్నది.
ఒకప్పుడు ఒక్క పథకం రావడం గగనమైన పరిస్థితి నుంచి ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకే ఇంట్లో మూడు నుంచి నాలుగు సంక్షేమ పథకాలు అందుతుండడం విశేషం. ఇలా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఒకే ఇంట్లో ముచ్చటగా మూడు సంక్షేమ పథకాల మంజూరయ్యాయి. ఏటా రూ.25వేలు అందించే రైతుబంధు, ఆపద సమయంలో రూ.5 లక్షల అందించిన రైతుబీమా, ఆడబిడ్డ పెండ్లికి రూ.
లక్షా నూట పదహారు వేల సాయం అందించిచన కల్యాణలక్ష్మి పథకాలు రావడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. మూడు పథకాల ద్వారా లబ్ధి చేకూరడంతో సీఎం కేసీఆరే ఆదుకున్నారని, తమకు మేలు చేసిన ముఖ్యమంత్రి సల్లంగ ఉండాలని నిండుమనస్సుతో దీవిస్తున్నారు. ఇలా ఒక్కో కుటుంబంలో మూడు, నాలుగు పథకాలు అందుతున్నాయి. అంతేగాక చాలా కుటుంబాల్లో రైతుబంధు, సీఎం సహాయనిధితో పాటు ఆసరా పింఛన్లు అందుతుండడంతో ఎంతోమందికి న్యాయం చేకూరుతున్నది.
కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. నా చిన్నతనంలో పంటకు పెట్టుబడి కోసం తెచ్చిన డబ్బులు తీర్చలేక మా నాన్న జాటోతు బిచ్చు పురుగుల మందు తాగి చనిపోయాడు. అప్పుడు ఉన్న గవర్నమెంట్ మమ్ముల ఆదుకోలేదు. మా అక్క పెళ్లికి ప్రభుత్వం కల్యాణలక్ష్మితో రూ.లక్షా 16 ఇచ్చింది. తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.10వేల చొప్పున మాకు రూ.25 వేలు ఏడాదికి ఇస్తున్నది. సెప్టెంబర్ నెలలో మా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. తర్వాత అధికారులు వచ్చి 10 రోజుల్లో రూ.5లక్షలు మా ఖాతాలో వేశారు. అన్ని విధాలా ఆదుకున్న ప్రభుత్వాన్ని నా జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటా.
– జాటోత్ వీరన్న, ఎర్ర చకృతండా
నా భర్త అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్న క్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ముందస్తుగా చికిత్స కోసం ఎల్ఓసీ కింద రూ. 3.50లక్షలు ఇచ్చారు. అయినా ఆయన బతకలేదు. భర్త పేరు మీద భూమి ఉండడంతో ప్రభుత్వం రైతుబీమా పథకం కింద రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకున్నది. చికిత్స సమయంలో రూ.20లక్షల వరకు హాస్పిటల్ ఖర్చు అయినందున సీఎం సహాయనిధికి దరఖాస్తు పెట్టుకున్నం. కొద్ది రోజులకే రూ.లక్షా 50వేలు వచ్చినయ్. వాటితో పాటు రైతుబంధు డబ్బులు కూడా ఖాతాలో జమవుతున్నయ్.
– సలుగు సూరమ్మ, కొమ్ములవంచ
నా కూతురుకు పెండ్లి చేశాను. పెండ్లి తర్వాత కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకుంటే కొద్ది రోజుల్లోనే నా భార్య మీద లక్షా 116 రూపాయల చెకును అధికారులు ఇంటికొచ్చి ఇచ్చారు. నాకు ఉన్న వ్యవసాయ పొలంలో రైతుబంధు ద్వారా ఏడాది రూ.25 వేలు ఇస్తున్నారు. సరారు దవాఖానలో మా కోడలుకు బిడ్డ, కొడుకు పుడితే కేసీఆర్ కిట్లు వచ్చాయి. వారికి సరారు దవాఖానలో చూపిస్తే ఇద్దరు పిల్లలకు డబ్బులు వచ్చినయ్. మాది వడ్రంగి కుటుంబం కావడంతో బీసీబంధు కింద లక్ష రూపాయల చెక్కు కూడా ఇచ్చారు. కేసీఆర్ ఇన్ని పథకాలు అమలు చేయడం వల్ల మాకు న్యాయం జరిగింది. మంచి చేస్తున్న కేసీఆర్ మేలును ఎప్పటికీ మర్చిపోం.
– బనాల వెంకన్నచారి, పెద్దనాగారం
నాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. ఆంధ్రా ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద కుమార్తె పెళ్లి చేసినం. అప్పుడు ఏమీ రాలేదు. తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత చిన్న బిడ్డ పెళ్లి చేసినం. చిన్నకూతురు పెండ్లికి కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి ఇస్తుందని ఊరోళ్లు చెప్తే మీసేవలో దరఖాస్తు చేశాను. కొద్ది రోజుల్లోనే లక్షా 116 రూపాయలు వచ్చినయ్. అలాగే అనారోగ్యంతో భర్త సోమయ్య చనిపోయాడు. విషయం తెలుసుకుని వ్యవసాధికారులు వచ్చి చూసి పోయారు. 10 రోజుల్లో ప్రభుత్వం మాకు రైతుబీమా ద్వారా నా ఖాతాలో రూ.5లక్షలు వేశారు. వాటితో అప్పులు తీర్చిన. నా భర్త పేరున భూమి ఉండడంతో మాకు రైతుబంధు డబ్బులు వస్తున్నాయి. మాకు మేలు చేసిన కేసీఆర్ సల్లంగ ఉండాలె.
– పుప్పాల నర్సమ్మ, కొమ్ములవంచ