గిర్మాజీపేట : ఇన్నేళ్లు వరంగల్ తూర్పు ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకులు చేసిన అభివృద్ధి, తాను చేసిన అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా, ఏ సెంటర్లోనైనా సిద్ధమేనని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. నియోజవర్గ అభివృద్ధిని తుంగలో తొక్కి, ముఖాలు చాటేసిన కొందరు ఘనాపాటీలు ఎలక్షన్లు రాగానే ప్రజల వద్దకు వస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. రాబోయే ఎలక్షన్లలో వారికెలా బుద్ధి చెప్పాలో ప్రజలకు తెలుసన్నారు. స్టేషన్ రోడ్డులోని మహేశ్వరీ గార్డెన్లో నాయీబ్రాహ్మణ సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం, కాకతీయ పరపతి సంఘం మొదటి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 ఏళ్లలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు ప్రజల కనీస అవసరాలు తీర్చకపోగా నియోజకవర్గాన్ని కార్మికులు దొరికే కార్ఖానాగా మార్చారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలో కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి జరిగిందన్నారు.
ప్రధాన రహదారులతో పాటు, అంతర్గత సీసీ రోడ్లు వేయించానని చెప్పారు. రూ.5 కోట్లతో మహిళా కార్మిక భవనం, అంతర్గత డ్రైనేజీ కాల్వలు, జిల్లా కేంద్రం, తూర్పు నియోజకవర్గం కేంద్రంగా కలెక్టరేట్ను తీసుకొచ్చినట్లు తెలిపారు. నాయీబ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పాటునందిస్తానన్నారు. నాయీబ్రాహ్మణులు ఆత్మగౌరవంతో జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తున్నదన్నారు. వారి సమస్యలకు త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు. ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సహకరిస్తానని, గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలను అందజేస్తామని చెప్పారు. స్థలం లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నాయీబ్రాహ్మణ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గందె కల్పనానవీన్, నియోజకవర్గ నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యెలకంటి సతీశ్, 61వ డివిజన్ అధ్యక్షుడు రాములు, ఎడ్ల మురళి, శ్రీరాముల సురేశ్, కొత్తపల్లి శ్రీనివాస్, సాంబయ్య, రమేశ్, సింగారపు రమేశ్, కుమారస్వామి, సమ్మెట వేణు, దశరథం, నాగరాజు, మామిడాల బాలు పాల్గొన్నారు.
క్రీడలు ప్రారంభం..
కాశీబుగ్గ : మంచి కుటుంబం నుంచే మంచి సమాజం ఏర్పడుతుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మంగళవారం 19వ డివిజన్లోని ఓ సిటీ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్రీడోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి మహిళల సహకారం ఎంతగానో అవసరమన్నారు. మహిళలు ఇంటితో పాటు అనేక బాధ్యతలతో సతమతమవుతుంటారని, వారిలో ఉత్సాహం నింపేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు వరంగల్ తూర్పు ప్రాంత అభివృద్ధిని విస్మరించారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలోని వాడవాడలా సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్తో పాటు పలు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. కబడ్డీ, కోకో, చెస్, క్యారమ్, షటిల్తో పాటు 16 రకాల క్రీడలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తొందర్లోనే వరంగల్కు మరిన్ని ఐటీ కంపెనీలను తీసుకువస్తామని దీంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఓని స్వర్ణలత, కావటి కవిత, పల్లం పద్మ, భోగి సువర్ణ, బస్వరాజ్ శిరీష, ముష్కమల్ల అరుణ, మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి, జిల్లా స్పోర్ట్స్ అధికారి ఇందిర, మెప్మా డీఎంసీ రేణుక, పద్మ పాల్గొన్నారు.